హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం, వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. శాసనమండలిలో మంగళవారం రాష్ట్రంలో అతివృష్టి – గోదావరి పరీవాహక ప్రాంతంలో వరదలు అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 16,030 మందికి రూ.10వేల చొప్పున సాయం అందించామని తెలిపారు. భద్రాచలం వద్ద 90 అడుగుల వరద వచ్చినా ముంపునకు గురికాకుండా 2016 ఇళ్లను నిర్మించడానికి సీఎం కేసీఆర్, రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, త్వరలో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. పోలవరం బ్యాక్ వాటర్ నష్టాలపై కేంద్రం ఒక అంచనా వేయాలని కోరారు. భద్రాచలం చుట్టూ ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణకు తిరిగి ఇవ్వాలని మరోసారి ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై రెండు రాష్ట్రాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాలని ప్రతిపాదించారు.
దేశంలో తెలంగాణ లేదా : పల్లా
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే తక్షణ సాయం అందించే కేంద్రం తెలంగాణలో నష్టం జరిగితే ఎలాంటి సాయం అందించడం లేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఈ దేశంలో తెలంగాణ అంతర్భాగం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వరదలు, వర్షాల వల్ల రూ.1400 కోట్ల మేర నష్టం జరిగిందని అంచనా వేసి కేంద్రానికి పంపామని, ఇంతవరకు ఒక్క పైసా కూడా సాయం చేయలేదని విమర్శించారు. వర్షాల వల్ల నష్టపోయిన ఆరు బీజేపీ పాలిత రాష్ర్టాలు, ఇతర రాష్ర్టాలకు మొత్తంగా రూ.3063 కోట్ల సాయం అందించారని గుర్తుచేశారు. ఆపద సమయం లో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించారని, కేంద్రం మాత్రం గవర్నర్ను భద్రాచలం పంపించి రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూసిందని విమర్శించారు. సీఎం పర్యటించిన రోజునే గవర్నర్ కూడా పర్యటించారని, కానీ ఆమె వరద నష్టంపై కేం ద్రానికి నివేదించి పరిహారం వచ్చేందుకు కృషి చేయలేదని చెప్పారు.
గోదావరి ఒకప్పుడు ఎండిపోయి ఉండేదని.. సీఎం కేసీఆర్ కృషితో జీవననదిగా మారిందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సాధారణ వర్షపాతాన్ని తాజా లెక్కల ప్రకారం అంచనా వేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. భారీ వర్షాలతో విద్యార్థుల యూనిఫాం బట్టలు, పుస్తకాలు తడిచాయని, వాటి స్థానంలో కొత్తవి ఇవ్వాలని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి కోరారు. ప్రతిపక్షాలు వరద రాజకీయం చేయడం సిగ్గు చేటని ఎమ్మెల్సీ తాత మధుసూదన్ విమర్శించారు. భద్రాచలం పరిసరాల్లోని ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కోరారు. ఈ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపడానికి కేంద్రానికి గవర్నర్ నివేదిక ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాలు, వరదలు వచ్చి నష్టం జరిగితే ప్రధానమంత్రి స్పందించలేదని, ఎలాంటి నష్ట పరిహారం ప్రకటించలేదని ఎమ్మెల్సీ జాఫ్రీ అన్నారు. కేంద్రం హోం మంత్రి తెలంగాణకు వచ్చి రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారని, కానీ వరద నష్టాలపై మాత్రం స్పందించలేదని అన్నారు. ప్రకృతి విపత్తును కూడా రాజకీయం చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ అభివర్ణించారు.