ఉమ్మడి పాలనలో ‘నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు’ అంటూ బెంగటిల్లి కైగట్టి పాడుకున్నది తెలంగాణ. సర్కారీ వైద్యంపై నమ్మకం సన్నగిల్లిన రోజులవి. కానీ, స్వరాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల రూపురేఖలు మారాయి. మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. అధునాతన యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాకో మెడికల్ కాలేజీతో ప్రజలకు వైద్యసేవలు మరింత చేరువయ్యాయి. ప్రజావైద్యంలో అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఫలితంగా జాతీయ ఆరోగ్యసూచీల్లో తెలంగాణ అత్యుత్తమ ఫలితాలను చూపుతున్నది. అందుకే ఇప్పుడు ఎంత పెద్ద జబ్బు వచ్చినా ప్రజలు ‘చలో సర్కారు దవాఖానకు’ అంటున్నారు.
హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం రోజురోజుకూ పెరుగుతున్నది. ఉమ్మడి పాలనలో కనీస వసతుల్లేక కునారిల్లిన ప్రభుత్వ దవాఖానల్లో రోగుల నాడి పట్టేందుకు కనీస సంఖ్యలోనైనా వైద్యులు ఉండేవారు కాదు. ప్రాథమిక వైద్య పరీక్షల నిర్వహణకు అవసరమైన పరికరాలు, సిబ్బంది నామమాత్రమే. పారిశుద్ధ్యం సంగతి సరేసరి. నాడు ప్రభుత్వ దవాఖానకు వెళ్లినవారికి ఉన్న రోగం తగ్గకపోగా కొత్త రోగాలు వచ్చేవి. దీంతో ప్రైవేట్ దవాఖానల్లో వేల రూపాయలు ఖర్చుచేసి ఆర్థికంగా చితికిపోయేవారు. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
మౌలిక వసతులు పెరిగాయి. కొత్తగా వేలకు వేలు వైద్యులు, సిబ్బంది వచ్చారు. పారిశుద్ధ్యం మెరుగుపడింది. ఉచితంగా 56 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్వయంగా ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తున్నారు. నిరంతరం సమీక్షలు, తనిఖీలు నిర్వహిస్తూ సేవల్లో నాణ్యతను మెరుగుపరుస్తున్నారు. ఫలితంగా ప్రజలు ఇప్పుడు ఎంత పెద్ద రోగం వచ్చినా ‘చలో సర్కారు దవాఖానకు’ అంటున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యసేవల నాణ్యత ఏటికేడు పెరుగుతుండటమే ఇందుకు కారణం.
ఓపీ సేవల్లోనే రూ.వెయ్యి కోట్లు ఆదా
నిరుడు రాష్ట్రంలోని అన్ని దవాఖానల్లో కలిపి 4.83 కోట్ల మంది ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు పొందారు. 2021లో ఈ సంఖ్య 4.23 కోట్లుగా ఉన్నది. అంటే ఒక్క ఏడాదిలోనే అదనంగా 60 వేల (15 శాతం) మంది ప్రభుత్వ దవాఖానల్లో పరీక్షలు చేయించుకున్నారు. సాధారణంగా ప్రైవేట్ దవాఖానల్లో ఓపీకి రూ.200 నుంచి 1000 వరకు వసూలు చేస్తుంటారు. ఈ లెక్కన ప్రభుత్వ దవాఖానల్లో ఒక్కొక్కరికి కనిష్ఠంగా రూ.200 ఆదా అయినట్టు లెక్కించినా మొత్తగా ప్రజలకు దాదాపు రూ.1,000 కోట్ల వరకు ఆదా అయినట్టే. ఉచితంగా పొందిన మందులు దీనికి అదనం. 2021లో రాష్ట్రవ్యాప్తంగా 14.16 లక్షల మంది రోగులు ప్రభుత్వ దవాఖానల్లో ఇన్ పేషెంట్లుగా చేరి, చికిత్స పొందారు. నిరుడు ఈ సంఖ్య సుమారు 20 శాతం పెరిగి 16.97 లక్షలకు చేరింది.
19% పెరిగిన ఆపరేషన్లు
ప్రభుత్వ దవాఖానల్లో ఐపీ, ఓపీ సేవలతోపాటు మేజర్, మైనర్ ఆపరేషన్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2021లో రాష్ట్రవ్యాప్తంగా 2.57 లక్షల సర్జరీలు జరుగగా.. నిరుడు ఈ సంఖ్య ఏకంగా 19 శాతం పెరిగి 3.04 లక్షలకు చేరింది. ప్రైవేట్ దవాఖానల్లో ఒక్కో మైనర్ సర్జరీకి కనిష్ఠంగా రూ.15 వేలు, మేజర్ సర్జరీకి రూ.50 వేలు ఖర్చవుతుంటాయి. గుండె మార్పిడి లాంటి సర్జరీలకైతే రూ.20-30 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రభుత్వ దవాఖానల్లో ఇవ్వన్నీ పూర్తి ఉచితంగా జరిగాయి.
రోజుకు 42 లక్షల ల్యాబ్ టెస్టులు
ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఇతర ల్యాబ్ టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఓపీ, ఐపీ పేషంట్లకు కలిపి నిరుడు ఏకంగా 152 కోట్ల టెస్టులు నిర్వహించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో టీ-డయాగ్నస్టిక్స్ ద్వారా నిర్వహించిన పరీక్షలతోపాటు పెద్ద దవాఖానల్లోని ల్యాబుల్లో సొంతగా నిర్వహించిన పరీక్షలూ ఉన్నట్టు తెలిపారు. ఈ లెక్కన నిరుడు రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున 42 లక్షలకుపైగా టెస్టులు జరిగాయి. 2021లో ల్యాబ్ టెస్టుల సంఖ్య 118 కోట్లుగా ఉన్నది. అంటే గతేడాది ఏకంగా 29% పెరిగాయి.
అధిక వసతులతో పెరిగిన నమ్మకం
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర వైద్యారోగ్య రంగం సమూలంగా మారిపోయింది. ఈ రంగానికి ఏటా బడ్జెట్ కేటాయింపులను పెంచుతుండటమే ఇందుకు కారణం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో వైద్యారోగ్య రంగానికి రూ.11 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం.. గత ఎనిమిన్నరేండ్లలో రూ.వందల కోట్లు వెచ్చించి అనేక పరికరాలను, మౌలిక వసతులను సమకూర్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో అదనంగా సిబ్బందిని నియమించడంతోపాటు టీ-డయాగ్నస్టిక్స్ లాంటి వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. నిరుడు ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ రెండు జిల్లాల్లోని ప్రజల సమగ్ర ఆరోగ్య సమాచారాన్ని సేకరించింది. వారికి హెల్త్ ప్రొఫైల్ కార్డులను అందజేసింది.
పారిశుద్ధ్యానికి పెద్దపీట
సర్కారీ దవాఖానల్లో పారిశుధ్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఒక్కో బెడ్కు ఈ ఖర్చును రూ.5 వేల నుంచి రూ.7500కు పెంచడంంతో దవాఖానలన్నీ పరిశుభ్రంగా మారాయి. మరోవైపు రోగులకు పోషకాహారాన్ని అందించేందుకు బడ్జెట్ను రెట్టింపు చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 18 పెద్ద దవాఖానల్లో రోగి సహాయకులకు సైతం మూడు పూటలా రూ.5కే భోజనం అందిస్తున్నది. ఈ చర్యల ఫలితంగా ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకం పెరిగింది.
హైదరాబాద్ నలువైపులా ఎల్బీనగర్,
సనత్నగర్, గచ్చిబౌలి, అల్వాల్లో రూ.2,679 కోట్లతో ఏర్పాటు చేస్తున్న టిమ్స్ పనులతోపాటు రూ.1571 కోట్లతో చేపట్టిన నిమ్స్ విస్తరణ పనులు కూడా పూర్తయితే హైదరాబాద్లోనే కొత్తగా సుమారు 6 వేల సూపర్ స్పెషాలిటీ బెడ్లు అందుబాటులోకి వస్తాయి.
ఆరోగ్య తెలంగాణ దిశగా వేగంగా అడుగులు
సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’ వైపు వేగంగా అడుగులు వేస్తున్నది. పీహెచ్సీలు మొదలు సూపర్ స్పెషాలిటీ దవాఖానల వరకు అన్ని స్థాయిలో అదనపు వైద్య సిబ్బందిని నియమించి, అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం. ఇటీవలే సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు నియామకపత్రాలు ఇచ్చాం. 5 వేలకుపైగా స్టాఫ్ నర్సుల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. అన్ని స్థాయిల్లో వైద్యులు, సహాయక సిబ్బంది నియామకాలు జరుగుతున్నాయి.
మరోవైపు అన్ని దవాఖానల్లో అవసరమైన అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తెస్తున్నాం. ఇటీవల ప్రారంభించిన 56 టిఫా స్కానింగ్ యంత్రాలు ఇందుకు ఉదాహరణ. రూ.కోట్లు విలువైన సీటీ స్కానింగ్ లాంటి యంత్రాలు, రేడియాలజీ, క్యాథ్ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నాం. వీటికితోడు హెల్త్ ప్రొఫైల్, కంటివెలుగు వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టాం. తద్వారా ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. గత సంవత్సరం ఆరోగ్య శాఖకు సీఎం కేసీఆర్ ఏకంగా రూ.11,440 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఇది 2021లో జరిపిన కేటాయింపుల కంటే 76% ఎక్కువ. ఆరోగ్య రంగంపై సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి ఇదే నిలువెత్తు నిదర్శనం.
– హరీశ్రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి
బడ్జెట్ కేటాయింపు పెరిగిందిలా..