కరీంనగర్ : ప్రజల మనసు చూరగొనెలా ప్రజాప్రతినిధులు పని చేసి ప్రజల చేత మన్ననలు పొందాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. కరీంనగర్ రూరల్ మండల సర్వ సభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సమైక్య పాలనలో పల్లెలకు రహదారులు కనీస సౌకర్యాలు లేక నానా అవస్థలు పడే వారని, కానీ నేడు స్వయంపాలనలో కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన పనులతో పల్లెల రుపు రేఖలు మారిపోయయాని అన్నారు.
కరీంనగర్ రూరల్ మండలంలో పెండింగ్ పనులన్నింటి కోసం 16 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశామని ..ఈ పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయని త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని ప్రజలు పూర్తిస్థాయి విశ్వాసంతో ఉన్నారని, కేసీఆర్తోనే తమ పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉంటుందని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు.
పల్లెల్లో నేడు ప్రతి ఇంటికి తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్నాయని..కేసీఆర్ను మరోసారి దీవించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. బిజెపి, కాంగ్రెస్లు మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారని గతంలోపాలించిన ఈ పార్టీలు మళ్లీ అధికారంలోకి వస్తే చీకటి రోజులు వస్తాయని ప్రజలకు తెలుసని..అందుకే వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
పనిచేసే ప్రభుత్వానికే ప్రజలు పట్టం కడతారని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, జడ్పీ సీఈవో వీర బుచ్చయ్య, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, జెడ్పీటీసీ పురమల్ల లలిత, పాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, ఎంపీడీవో జగన్ మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.