దమ్మపేట, ఫిబ్రవరి 23 : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాన్ని తలపిస్తున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత మండలంలో తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నది. పొద్దుపోయే వేళ రోడ్డు ప్రమాదానికి గురైన క్షతగాత్రుడికి అతడి బంధువులు, బాటసారుల సెల్ఫోన్ వెలుతురులో వైద్య సేవలందించిన దైన్యం నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియదన్న కేసీఆర్ ముందస్తు హెచ్చరికలను కండ్లకు కట్టింది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండల కేంద్రానికి చెందిన గొట్టిపర్తి యోగానంద్ ఆదివారం రాత్రి బైక్పై దమ్మపేట ప్రధాన సెంటర్ మీదుగా ప్రయాణిస్తున్నాడు.
అదే సమయంలో మరో ద్విచక్రవాహనం రావడంతో ఈ రెండు బైకులూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గొట్టిపర్తి యోగానంద్ గాయపడగా వెంటనే స్థానికులు పీహెచ్సీకి తరలించారు. అదే సమయంలో గ్రామంలో కరెంటు పోవడంతో పీహెచ్సీ అంధకారమైంది. ఏడాది కాలంగా నిధులు లేకపోవడంతో ఇన్వర్టర్ మూలనపడి ఉండటంతో అతడికి వైద్య అందించే పరిస్థితి లేకపోయింది. అతడి బంధువులు, బాటసారులు తమ సెల్ఫోన్లలో లైట్లు ఆన్ చేసి ఆ వెలుతురులో అక్కడి వైద్యులు ఆ క్షతగాత్రుడికి చికిత్స చేశారు. సాక్షాత్తు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత మండలమైన దమ్మపేటలోని పీహెచ్సీ పరిస్థితి ఇంత దయనీయంగా ఉండడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. తన సొంత మండలంలోని పీహెచ్సీలో ఇన్వర్టర్, జనరేటర్ వం టివి లేకపోయినా మంత్రి తుమ్మల కనీసం స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు.
దమ్మపేట పీహెచ్సీ సమస్యలతో కొట్టుమిట్టాడుతుండటం దయనీయమని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజారోగ్యం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమేమిటని ప్రశ్నించారు. మంత్రి తుమ్మల తన సొంత మండలంలోని పీహెచ్సీకి విద్యుత్ సౌకర్యాన్ని కల్పించకపోవడమేమిటని నిలదీశారు.