రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): వరద నీటిలో మునిగిన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గురువారం తేరుకున్నది. రికార్డు స్థాయిలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం.. చెరువులన్నీ మత్తళ్లు దుంకి నీరంతా ఇండ్లలోకి, రోడ్లపైకి చేరిన విషయం తెలిసిందే. వరద తగ్గడంతో శాంతినగర్, వెంకంపేట, సర్దార్ నగర్, అశోక్నగర్ వాసులంతా బయటకు వచ్చారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలన్న మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అధికార యంత్రాగం యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించింది. గురువారం ఉదయం నుంచే మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి రోడ్ల మరమ్మతులు చేపట్టారు. మొరం పోసి రోడ్లపై పడిన గుంతలను పూడ్చి వేశారు. కలెక్టరేట్లోకి వరద నీరు చేరకుండా జేసీబీలతో 400 మీటర్ల వరకు కచ్చా కాలువ నిర్మాణం చేపట్టారు. లోతట్టు ప్రాంతమైన శాంతినగర్లోని ప్రజలకు ఆహార పొట్లాలు అందించారు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ 300 కుటుంబాలకు 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.