(స్పెషల్ టాస్క్ బ్యూరో) నాందేడ్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ను నిండు మనసుతో ఆహ్వానిస్తున్నామని అక్కడి ప్రజలు అంటున్నారు. బీఆర్ఎస్ ఏర్పాటు, కేసీఆర్ పర్యటనపై ఉత్సాహం గా మాట్లాడిన ప్రజలు.. పాత పార్టీలు కాం గ్రెస్, బీజేపీ, శివసేన, ఎన్సీపీతో విసిగిపోయామని తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను కండ్లారా చూస్తున్నామని, అవి తమ పేద బతుకుల్లో ఆశ పెంచిందని వెల్లడించారు. బీఆర్ఎస్ మహారాష్ట్రలో పోటీ చేసి యువ నాయకులను బరిలో నిలపాలని కోరారు. నాందేడ్ ప్రాంతంలో 100 ఏండ్ల క్రితం ఏర్పాటైన నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్(ఎన్టీసీ) బట్టల మిల్లు మూతపడినా, అందులో పని చేసిన కార్మికులకు ఏ పార్టీ ప్రత్యామ్నాయ ఉపాధి చూపలేదని తెలిపారు. అదే.. తెలంగాణలో కాగజ్నగర్లో మూతపడిన పేపర్ మిల్లు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత తెరిపించారని, సిరిసిల్ల వరంగల్లో చేనేత వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారని ఓ చేనేత యువకుడు వివరించారు.
పరిశుభ్రత దారుణం
నాందేడ్లో పరిశుభ్రత ఉండదని చెరుకు రసం విక్రేత వెల్లడించారు. మున్సిపాలిటీ వాళ్లు తమలాంటి చిరు వ్యాపారులను బెదిరిస్తారేతప్ప, పారిశుద్ధ్య పనులపై శ్రద్ధ పెట్టరని చెప్పా రు. తమ చుట్టాలు నిర్మల్లో ఉన్నారని, అక్కడి చిన్న చిన్న జీపీల్లోనూ చెత్త ఎత్తేయటానికి ట్రాక్టర్లు కనిపించాయని వెల్లడించారు. హరితహారం ఎంతో బాగుందని కొనియాడారు.
గొప్పగా సమావేశ ఏర్పాట్లు
నాందేడ్లోని గురుగోవింద్ మైదానంలో బీఆర్ఎస్ సమావేశ ఏర్పాట్లను చూసి పలువురు ఆటోడ్రైవర్లు, కార్మికులు విస్తుపోయారు. ఇంతవరకు నాందేడ్లో ఇలా ఒక రాజకీయ నాయకుడి సభ కోసం ఇంతటి ఏర్పాట్లు చూడలేదని తెలిపారు. పకడ్బందీగా గుడారాలతో కూడిన సమావేశ వేదిక బాగుందని, ఇక్కడికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తున్నదని పేర్కొన్నారు.
సాగునీళ్లు లేక బీడువారిన భూములు
నాందేడ్ జిల్లా నుంచి గోదావరి, పెన్గంగా నదులు ప్రవహిస్తున్నా, రైతులకు సాగునీరు అందటం లేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. విష్ణుపురి, బాబ్లీ తప్ప చిన్న, మధ్య తరగతి ప్రాజెక్టులే లేవని ఓ రైతు చెప్పారు. అప్పు చేసి బోరు వేయించుకొందామన్నా తెలంగాణ మాదిరి వ్యవసాయనికి ఉచిత కరెంటు లేదని ఉండదని వాపోయారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటున్న కేసీఆర్వైపు తమ రైతులంతా చూస్తున్నారని తెలిపారు. పంటలు పండక, పంట రుణాలు సమయానికి అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మరో రైతు చెప్పారు. నిరుడు నాందేడ్ జిల్లాలో 150 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారని వివరించారు. ఓ మహిళ మాట్లాడుతూ.. రేషన్ సరుకులు కూడా సమయానికి లభించే వ్యవస్థ లేదని తెలిపారు.