ములుగు : రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి నది వరద ఉధృతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ..వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారన్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా లోతట్టు ముంపు గ్రామాలను అప్రమత్తం చేస్తూ అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతుందన్నారు.
ఏ సహాయం కావాలన్నా ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లొద్దన్నారు. కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, పీఓ అంకిత్ తదితరులు ఉన్నారు.