సూర్యాపేట : కంటిచూపు సమస్యను నిర్లక్ష్యం వహిస్తున్న ప్రజలను చైతన్యం చేసి కంటి వెలుగులో పరీక్షించుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అధికారులకు సూచించారు. సూర్యాపేట లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆవరణలో సూర్యాపేట మున్సిపాలిటీ, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన కంటి వెలుగు అవగాహన ర్యాలీని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ విడత కంటి వెలుగు కు జిల్లా వ్యాప్తంగా 600 క్యాంపులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కంటి వెలుగు తరహ పథకం తెలంగాణ లో మినహా ప్రపంచం లో ఎక్కడా లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ఆలోచనల నుంచి పుట్టినదే కంటి వెలుగు కార్యక్రమమని అన్నారు. బాధితులకు అక్కడికక్కడే కళ్ల జోడు ను అందిచడమే కాకుండా అవసరమయ్యే వారికి ఆపరేషన్లను సంబంధిత ఆసుపత్రి లలో చేయిస్తామని తెలిపారు.
రేపు ఖమ్మంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు కంటి వెలుగును ప్రారంభిస్తారని వివరించారు. 19 నుంచి సూర్యాపేట తో పాటు అన్ని జిల్లా లో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. కార్యక్రమం లో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణ, కమిషనర్ రామానుజుల రెడ్డి, జడ్పీటీసీ జీడి బిక్షం తదితరులు పాల్గొన్నారు.