ఇబ్రహీంపట్నం, తాండూరు, ఫిబ్రవరి 4: తెలంగాణలో రైతులు, పేద ప్రజల కోసం ఉన్న అద్భుత పథకాలను మహారాష్ట్రలో అమలు చేయాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, తాండూరులో జీవనం కొనసాగిస్తున్న మహారాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించేందుకు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో పాటు కుల వృత్తులను ప్రోత్సహిస్తూ ఆర్థిక సహాయం లాంటి పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలంటే కేసీఆర్ ప్రధానమంత్రి కావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్తో దేశంలోని అన్ని రాష్ర్టాలకు మేలు జరుగుతుందన్న నమ్మకం ఉన్నదని తెలిపారు. బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత ఆదివారం మహరాష్ట్రలో నిర్వహించనున్న తొలి సమావేశాన్ని విజయవంతం చేసేందుకు.. తమ బంధుమిత్రులకు ఫోన్చేసి సమావేశానికి వెళ్లాలని తెలిపినట్టు ‘నమస్తేతెలంగాణ’తో పేర్కొన్నారు.
అన్ని వర్గాలకు సమన్యాయం
తెలంగాణలో అన్ని వర్గాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం సమాన హక్కులు కల్పిస్తున్నది. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు, దళితబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, బీసీలు, ఎస్సీలు, ఎస్టీల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాలకు సమాన న్యాయం చేస్తున్నారు. ఇలాంటి పథకాలు మహారాష్ట్రలోనూ ప్రవేశపెట్టాలి.
– శివ, నాందేడ్
బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు
భవిష్యత్తుపై ముందు చూపు ఉన్న కేసీఆర్ బీఆర్ఎస్తో జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. దేశంలో రైతుల, బీదల బాధలు తెలిసిన ఒకే ఒక నాయకుడు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు వంటి పథకాలు మహారాష్ట్రలోనూ అమలు చేయాలి. తెలంగాణ మాడల్ దేశవ్యాప్తం కావాలి. మహారాష్ట్రలో నిర్వహించే బీఆర్ఎస్ సమావేశానికి మా సంపూర్ణ మద్ధతు ఇస్తున్నాం.
– సాగ్రే సుధాకర్, తుల్జాపూర్, మహారాష్ట్ర