హుజూరాబాద్, అక్టోబర్ 10: ప్రజలకు ఎలాంటి ఉపయోగంలేని ఉత్త మాటలు చెప్తున్న బీజేపీ పార్టీ కావాలా.. చెప్పిన ప్రతి హామీని ఆచరణలో చూపెడుతున్న టీఆర్ఎస్ కావాలో ప్రజలు ఆలోచించాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు కోరారు. బీజేపీవి ఝూటా మాటలని, గోబెల్స్ ప్రచారాలని మండిపడ్డారు. గెలిస్తే ప్రజలకు ఏంచేస్తారో ఈటల రాజేందర్ ఎందుకు చెప్తలేరని నిలదీశారు. ఆదివారం బీజేపీ హుజూరాబాద్ పట్ణణ అధ్యక్షుడు నందగిరి మహేందర్రెడ్డితోపాటు సుమారు 600 మంది ఏబీవీపీ, బీజేపీ, ఎన్ఎస్యూఐ, పీడీఎస్యూ ఇతర విద్యార్థి సంఘాల నాయకులు టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. బీజేపీ నేత ఈటల ప్రచారంలో తానేంచేస్తాడో చెప్పకుండా టీఆర్ఎస్పై బురద జల్లుతున్నారన్నారు. ప్రజల్లో సానుభూతి పొందేందుకు తనమీద దాడి చేస్తారని ఈటల ప్రచారం చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. రాజేంద్ర భయపడకు.. మీకు ప్రభుత్వం అన్నిరకాలుగా రక్షణ ఇస్తుందని చెప్పారు. ఈటల మోసానికి, గెల్లు విధేయతకు మధ్య ఎన్నిక జరుగుతుందన్నారు.
స్వార్థంతోనే బీజేపీలోకి ఈటల
తన స్వార్థం కోసం ఈటల పార్టీ మారినంత మాత్రా న.. ప్రజలు కూడా మారాలా?.. అబద్ధాలు నిజాలైతాయా? అని హరీశ్రావు ప్రశ్నించారు. ఇక్కడికి వచ్చి మేము అభివృద్ధి పనులు చేస్తే.. మీ కేంద్ర మంత్రులు చేతులు ఊపుకుంటూ వచ్చారని ధ్వజమెత్తారు. బీసీ నాయకుడినని చెప్పుకునే ఈటల ఏరోజూ బీసీల బాగు కోసం పాటుపడలేదని ఆరోపించారు. బీసీల కోసం పోరాటం చేసిన ఆర్ కృష్ణయ్య సీఎంను కలిసి మంత్రిత్వ శాఖ, బీసీ కులగణన తీర్మానంపై అభినందించారని గుర్తుచేశారు. నిజమైన బీసీ నాయకుడివైతే కేంద్రంతో మాట్లాడి బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టించాలని ఈటలకు సవాల్విసిరారు. మహేందర్రెడ్డి మంచి నాయకుడని, అలాంటి నాయకుడినే కాపాడుకోలేకపోయావు.. ప్రజలను ఏం కాపాడతావని ప్రశ్నించారు. పేద ప్రజలకు సొంత స్థలంలో ఇండ్లు కావాలంటే టీఆర్ఎస్తోనే సాధ్యమని, గెల్లును గెలిపించాలని పిలుపునిచ్చారు. తన ఆస్తులు కాపాడుకునేందుకు ఈటల బీజేపీలోకి వచ్చాడని టీఆర్ఎస్ నాయకుడు నందగిరి మహేందర్రెడ్డి ఆరోపించారు. ధనబలంతోనే తాను గెలుస్తాననే అహంకార భావనతో ఈటల ఉన్నాడని.. రాజీనామా చేసిన రోజే ఆయన ఓటమి ఖాయమైందన్నారు.
చేసింది లేదు.. చెప్పేది లేదు
డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించినా, కాలేజీ తెచ్చినా, స్టేడియం తెచ్చినా అని చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి ఈటల రాజేందర్కు లేదు. దీంతో సెంటిమెంట్ డైలాగులు చెప్తూ మొసలి కన్నీరు పెడుతున్నారు. బతుకమ్మ ఆఫర్గా పండుగ పూట బీజేపీ మరోసారి సిలిండర్ ధరను రూ.15 పెంచింది. ఈ నెల 30న సిలిండర్కు దండంపెట్టి వెళ్లి ఉప ఎన్నికలో బీజేపీని ఓడించాలి.
– మంత్రి హరీశ్రావు
బ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం కృషి
హుజూరాబాద్ టౌన్ : బ్రాహ్మణుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని, అలాంటి తెలంగాణ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి బ్రాహ్మణులంతా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని మంత్రి హరీశ్రావు కోరారు. ఆదివారం హుజూరాబాద్లో విష్ణుదాస్ గోపాల్రావు అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గస్థాయి బ్రాహ్మణ సమ్మేళనానికి తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణారావుతో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బ్రాహ్మణుల ఆశీర్వచనంతో గెల్లు శ్రీనివాస్కు గెలుపు ఖాయమైందని, ప్రతీ బ్రాహ్మణుడు వంద ఓట్లతో సమానమన్నారు. బ్రాహ్మణుల సమస్యలను ఎన్నికల కోడ్ తర్వాత పరిషరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యూపీలో బ్రాహ్మణులను అణచివేసిన బీజేపీ, తెలంగాణలో ఎలా మేలు చేస్తుందని ప్రశ్నించారు.