జనగామ, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): జమిలి అయినా, జంబ్లింగ్ అయినా, ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్దే హ్యాట్రిక్ గెలుపు అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. కేసీఆర్కు ముఖ్యమంత్రిగా మూడోసారి పట్టం కట్టాలని తెలంగాణ ప్రజలు ఎప్పుడో సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని చెప్పారు. సోమవారం జనగామ జిల్లా పాలకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే బీజేపీ జమిలి ఎన్నికల డ్రామాలు ఆడుతున్నదని మంత్రి హరీశ్రావు అన్నారు. బీజేపీకి దేశంలో ఎదురుగాలి వీస్తున్నదని, తెలంగాణలో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. జమిలీ ఎన్నికల కమిటీలో దక్షిణాది రాష్ర్టాల నుంచి ఎందుకు ప్రాతినిధ్యం కల్పించలేదని ప్రశ్నించారు. దక్షిణాదిపై, ముఖ్యంగా తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం 10 రాష్ర్టాలకు అన్నం పెడుతున్న అన్నపూర్ణ అని కొనియాడారు. లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలోనూ బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అబద్ధాల డిక్లరేషన్లు ఎన్ని చేసినా ప్రజలు నమ్మరని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. ఎన్నికల కోసం తెలంగాణలో డిక్లరేషన్లు చేయడం కాదని, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోనూ ఇలాంటి డిక్లరేషన్లు అమలుచేయాలని చురక అంటించారు. చెల్లని రూపాయి కాంగ్రెస్ అని, ప్రజాబలం లేని నాయకుల మాటలు ప్రజలు నమ్మరని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజల్లోకి వెళ్లి ఓటు అడుగుతున్నామని తెలిపారు. ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, రైతు రుణమాఫీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ప్రాజెక్టులు, మెడికల్ కాలేజీలు సహా నియోజకవర్గానికి ఒక 100 పడకల దవాఖాన తీసుకొచ్చామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో దేవాదుల ద్వారా రైతాంగానికి గోదావరి జలాలు అందించామని వెల్లడించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలుచేస్తున్న పథకాలు ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో దివ్యాంగులకు రూ.4,016 ఇస్తుంటే, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రూ.1,000, రాజస్థాన్లో రూ.750, ఛత్తీస్గఢ్లో రూ.1,000 మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. అబద్ధాల పేరుతో కాంగ్రెస్ ఓట్లు అడుగుతున్నదని ధ్వజమెత్తారు. ఇంటి ముందు అభివృద్ధి-కంటిముందు అభ్యర్థి అని సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రజల మధ్యే ఉంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి ఆగిపోతుందని తెలిపారు. 24 గంటల కరెంట్ బంద్ అవుతుందని వెల్లడించారు. సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అరూరి రమేశ్, ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.