హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): చీమలు పుట్టల్లోంచి దండెత్తినట్టు.. ఉసిళ్లు పుట్టలను పలుగదీసుకొని ఎగజిమ్మినట్టు ములుగులో గులాబీ జనజాతర. ఎటుచూసినా జనమే.. ఎక్కడ చూసినా గులాబీ గుబాళింపే. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాదసభ రెండేండ్లకోసారి జరిగే మేడారం మహాజాతరను తలపించింది. అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ములుగు జిల్లాలో దూరాన్ని కూడా లెక్కచేయకుండా జనం సీఎం సభకు తరలివచ్చారు. ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట, మంగపేట, వెంకటాపూర్ మండలాలు ములుగుకు పోటెత్తాయి. 120 కిలోమీటర్ల దూరంలోని కన్నాయిగూడెం, ఏటూరునాగారంనుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. జిల్లా జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరు సభలోనే ఉండటం విశేషం. ఆదివాసీగూడేలు, లంబాడితండాలు, పస్రా, చల్వాయి, కమలాపూర్ సహా ములుగు నియోజకవర్గం అంతా ఏకమై జై తెలంగాణ నినాదాన్ని మార్మోగించాయి.
వాతావరణ ప్రతికూల పరిస్థితులను అధిగమించి, చలిగాలులు, జోరువానను లెక్కచేయక జనం బీఆర్ఎస్కు జేజేలు పలికారు. జోరువానలో కొంగులు పైన కప్పుకొని, కుర్చీలు తలపై పెట్టుకొనిమరీ సీఎం ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకించారు. స్వరాష్ట్రంలో గూడేలను పంచాయతీలుగా చేసి, పోడు పట్టాలను అందజేసి జల్ జంగల్ జమీన్ నినాదాన్ని సాకారం చేసిన సీఎం కేసీఆర్కు ఆదివాసీ, గిరిజన బిడ్డలు పబ్బతి పట్టారు. దీంతో ములుగు ప్రజా ఆశీర్వాదసభ అఖండజ్యోతిలా వెలుగులీనింది. ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపును ఎవ్వరూ ఆపలేరని సభ విస్పష్టం చేసింది. ‘సాదుకున్నా మీరే సంపుకున్నా మీరే. నాకు అవ్వయ్యలేరు. ములుగు ప్రజలే నా తల్లిదండ్రులు.. అన్నాదమ్ముళ్లు.. అక్కాచెల్లెండ్లు’ అని బడే నాజగ్యోతి తాను అభ్యర్థిననే గర్వంతోకాకుండా సగటు ఆదివాసిబిడ్డగా ప్రజల ముందు తనను తాను ఆవిష్కరించుకున్నారు. ఆమె భవిష్యత్తు కార్యాచరణను ఎరుకచేసిన తీరుకుతోడు సీఎం కేసీఆర్ బడే నాగజ్యోతిని పరిచయం చేసి, ఆమె రాజకీయ భవిష్యత్తుపై ఇచ్చిన అభయం.. ములుగు నియోజకవర్గ అభివృద్ధికి తనదీ బాధ్యత అని ఇచ్చిన భరోసా ములుగు ప్రజల్లో విజయసంతకం చేసిందనే నిశ్చితాభిప్రాయం వ్యక్తమైంది.
ములుగులో బడే నాగజ్యోతి గెలుపు ఖరారయ్యిందనే స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. మరోవైపు సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చందూలాల్ ఓడిపోయినా సరే ఆ ఎన్నికల్లో ములుగు జిల్లా చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని, ‘ఈసారి మీతో నేను పంచాయితే పెట్టుకుంటా. మీరు పోయినసారి ఓడించినా.. నేను నా మాటను నిలబెట్టుకున్నా, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం పాలకుడిగా నా కర్తవ్యం. నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను. మాట ఇవ్వకపోయినా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశాను. ఏటూరునాగరం నుంచి వరంగల్కు వైద్యం కోసం పోవాలంటే ఇబ్బందులున్నాయని తెలిసి డయాలసిస్ సెంటర్ను పెట్టాను. ఈసారి మీరు బడే నాగజ్యోతిని బ్రహ్మాండంగా గెలిపించండి. ములుగును నిత్యం వెలిగే జ్యోతిలా మారుస్తా. ఇది నా బాధ్యత’ అని మాట్లాడుతున్నప్పుడు జనం ‘ఈసారి అలా కాదు.. ఈసారి అలా కాదు.. నాగజ్యోతి గెలిచిపోయిందనుకోండి.. మేం గెలిపించి.. నాటి తప్పును సరిదిద్దుకుంటాం’ అని అభయం ఇచ్చారు. జై తెలంగాణ.. జై కేసీఆర్.. అంటూ నినాదాలు చేశారు. ములుగుతోపాటు మంచిర్యాల, రామగుండం, భూపాలపల్లిల్లో నిర్వహించిన సభలు వేటికవే పోటాపోటీగా సాగాయి.
సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాదసభలు జనసునామీలను తలపించాయి. పెద్దసంఖ్యలో తరలివచ్చిన జనంతో గోదావరి తీరం పోటెత్తింది. ఇసుకేస్తే రాలని జనం సభా ప్రాంగణాన్ని ముంచెత్తింది. మంచిర్యాల, రామగుండం, భూపాలపల్లి ఈ మూడు నియోజకవర్గాలు సింగరేణి కొంగుబంగారమై విరాజిల్లుతున్నాయి. తెలంగాణ సాధన పోరులో ‘పార… చెమ్మాస్’తో సింగరేణి మోగించిన ఉద్యమ సైరన్స్ఫూర్తి ప్రజా ఆశీర్వాద సభల్లోనూ ప్రతిఫలించింది. ‘కొంగునడుముకు చుట్టవే చెల్లమ్మ కొడవండ్లు చేపట్టవే చెల్లమ్మ’ అన్నట్టు ములుగు సభల్లో మహిళాలోకం బీఆర్ఎస్కు అజేయ తిలకాన్ని దిద్దింది. ములుగు, భూపాలపల్లి సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తుండగా హోరుగాలి.. జోరువాన వచ్చినా జనం కదలకుండా నిలబడి ఆసక్తిగా సీఎం కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించింది. ‘బీఆర్ఎస్ పార్టీ ఉప్పెనైనా ఈదగలదు.. ఈ చిరుజల్లుకెందుకు చెదిరిపోతాం’ అన్నట్టు గులాబీ సభలు నిరూపించాయి. తాము ఎర్రటి ఎండను లెక్కచేయం.. వీచేగాలిని తట్టుకుంటాం.. జోరువాననూ లెక్కచేయం.. అని కేసీఆర్ సభలకు వచ్చిన జనం ఇంచుకూడా కదలకుండా తమ చేతులను నొసటికి గొడుగులా మార్చి నిల్చున్నారు. కొంగులు తలమీదవేసుకొని కేసీఆర్ ప్రసంగాన్ని విన్నారు. వాన ఎక్కువైతే కూర్చున్న కుర్చీలను సైతం గొడుగులా మలచుకున్నారే తప్ప అడుగు కదల్చక అధినేత ప్రసంగాన్ని చెవులొగ్గి వింటూనే సందర్భోచితంగా స్పందిస్తూ తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుందన్న బలమైన సంకేతాలను ఇచ్చారు. ఏ పరిస్థితుల్లోనూ తాము కేసీఆర్ వెంటే నిలుస్తామని గోదావరి తీరం తేల్చి చెప్పింది.