Minister Gangula | తెలంగాణ ప్రజలు కేసీఆర్నే మరోసారి ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ కేసీఆర్ అంతటి ధైర్యవంతుడిని చూడలేదని, ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించారన్నారు. నమ్మకంతో టికెట్ అందించిన సీఎం కేసీఆర్కు జిల్లాపక్షాన ప్రత్యేకంగా ధనవ్యాదాలు తెలిపారు. పార్టీ ప్రతిష్టను పెంచే విధంగా గెలుపుతో పాటు ఇతర నియోజకవర్గ అభ్యర్థులు గెలిచేలా కృషి చేస్తామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారన్నారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు టికెట్ ఆశించారని, టికెట్ రానివారంతా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఏకతాటిపైకి తీసుకువస్తామని చెప్పారన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేయనున్నారన్నారు. మంథని, హుజూరాబాద్లలో విస్తృత ప్రచారంతో భారీ మెజారిటీతో గెలుస్తామన్నారు. 50 సంవత్సరాల దారిద్ర్యాన్ని చవిచూశామని, గడిచిన పదేళ్లుగా కేసీఆర్ పాలనలో ఆనందాన్ని చూస్తున్నామన్నారు. మరోసారి కేసీఆర్ను సీఎంగా నిలిపేందుకు మరోసారి గెలిపించాలని కోరారు. భయం, భక్తి, క్రమిశిక్షణ, రెట్టింపు ఉత్సాహంతోపాటు ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే పరిస్థితి లేదని చెప్పారు. సమావేశంలో మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.