హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 10 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యులపట్ల వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాగ్రహం పెల్లుబికుతున్నది. హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ఓటు అడిగేందుకు బీజేపీ నాయకులు తమ ఇంటికి రావొద్దని ప్రజలు ఖరాఖండిగా చెబుతున్నారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణవాసులు తమ ఇంటి ముందు ‘ఓటు కోసం బీజేపీ నాయకులు రావొద్దు.. మా ఓట్లు టీఆర్ఎస్కే’ అని ఉన్న బోర్డులను ఏర్పాటుచేసుకొన్నారు. 27వ వార్డులో ప్రతీ ఇంటి ఎదుట గేట్లకు ఏర్పాటుచేసిన బోర్డులు బీజేపీపై వ్యతిరేకతకు పరాకాష్ఠగా నిలుస్తున్నాయి. ‘వంట గ్యాస్ ధరలు పెంచిన బీజేపీకి ఓటు వేయం.. దయచేసి ఇబ్బంది పెట్టకండి’ అని ఒకరు, ‘పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిన బీజేపీకి ఓటు వేయం’ అని మరొకరు, ‘వీ లవ్ కేసీఆర్, వీ వోట్ ఫర్ కార్’ అంటూ మరొకరు.. ఇలా రకరకాల బోర్డులు పెట్టి బీజేపీ నేతలకు చుకలు చూపించారు. 7వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల ఇంటి వద్ద ఖాళీ సిలిండర్తో నిరసన తెలిపారు. కిందివాడలోని 5వ వార్డు, 7వ వార్డులోనూ ఇదే విధమైన బోర్డులు దర్శనమిస్తున్నాయి. జమ్మికుంట మండలం వావిలాలలో ఓ యువకుడు బీజేపీ నాయకులు తమను ఓటు అడిగేందుకు రావొద్దని చేతులెత్తి మొక్కారు. ప్రజలనుంచి వస్తున్న వ్యతిరేకతను చూసి హుజూరాబాద్ బీజేపీ నాయకులు ఖంగుతిన్నారు.