హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 44 లక్షల 12వేల మందికి పింఛన్లు ఇస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ, మిర్జా రియాజుల్ హసన్, జీవన్ రెడ్డి ఆసరా పెన్షన్లపై అడిగిన ప్రశ్నకు మంత్రి బుధవారం సమాధానం చెప్పారు.
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా వ్యాధి గ్రస్తులకు నెలకు రూ. 2వేలు పెన్షన్ను ప్రభుత్వం ఇస్తుందని వివరించారు. వీటిలో కేంద్రం 6.66 లక్షల మందికి నెలకు రూ. 200 మాత్రమే ఇస్తుందని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే పెన్షన్ ఎవరికి సరిపోదని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఏటా రూ. 861 కోట్లు ఇవ్వగా తెలంగాణ ప్రభుత్వం నెలకు రూ. 971 కోట్లు అందజేస్తుందని వెల్లడించారు.
ఈ ఏడాది బడ్జెట్ లో ప్రభుత్వం రూ. 12వేల కోట్లను కేటాయించిందని వివరించారు.ఆసరా పెన్షన్ల వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిన తర్వాత మీసేవ ద్వారా 8 లక్షల 11వేల 817 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో అర్హులైన 6,05,018 మందికి కొత్తగా వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేశామన్నారు.వేలిముద్రల సమస్యను తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
డయాలిసిస్ రోగులకు కూడా 4వేల మందికి పింఛన్లు ఇస్తున్నామని వెల్లడించారు.పింఛన్లు తామే ఇస్తున్నామని కేంద్రం చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు.సమాజంలోని ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించికేసీఆర్మనసున్న మారాజుగా అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నారన్నారు.