భూభాగంలో 33 శాతం పచ్చదనం ఉంటేనే వాతావరణ సమతుల్యం సాధ్యమవుతుంది. పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో అడవులు తరిగిపోతున్నాయి. దీనివల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వర్షపాతం తగ్గుతున్నది. వాతవారణ సమతుల్యం దెబ్బతింటున్నది. మానవ జీవితమే అల్లకల్లోలం అవుతున్నది. ఈ పరిస్థితిలో మార్పు తేవడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నాలు ప్రారంభించింది. భూభాగంలో 33శాతం పచ్చదనం ఉండాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది. తెలంగాణలో సమృద్ధిగా వానలు కురిసేందుకు, అడవులను రక్షించి, చెట్లను పెంచి పచ్చదనాన్ని కాపాడటమే లక్ష్యంగా.. ‘‘వానలు వాపస్ రావాలె’’ అనే నినాదంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టారు.
తెలంగాణలో అటవీ భూమి 67 లక్షల ఎకరాలు (24 శాతం) ఉండగా, వార్షిక వర్షపాతం 845 మి.మీ.గా నమోదైంది. అటవీభూమి అంత ఉన్నప్పటికీ అందులో చెట్లు మాత్రం లేవు. సామాజిక అడవులు పెంచడంతో పాటు, అటవీ ప్రాంతంలో అడవిని పునరుద్దరించేందుకు తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో చర్యలు తీసుకున్నారు.
హరితహారం లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర భూభాగం 1,12,101 కిలోమీటర్లు ఉండగా అడవులు 26,903.70 కిలోమీటర్లమేర (24శాతం) ఉన్నాయి. హరితహారం ద్వారా అటవీ ప్రాంతాన్ని 33శాతానికి పెరిగేలా చేయడం.తద్వారా వానలు వాపస్ వచ్చేలా చూడటం. అడవిలో, రోడ్లకిరువైపులా పండ్ల చెట్లను నాటటంద్వారా నివాసాలు, పంటపొలాలపై దాడిచేస్తున్న కోతులకు ప్రత్యామ్నాయం చూపటం. వాతావరణంలో ప్రాణవాయువును పెంచటం, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటం, ఇతర పర్యావరణ లక్ష్యాలను చేరుకోవడం నాలుగు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలను నాటి సంరక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అటవీ ప్రాంతంలో 100కోట్ల మొక్కలు, అటవీ ప్రాంతం వెలుపల 120 కోట్ల మొక్కలు, జీహెచ్ఎంసీ పరిధిలో 10కోట్ల మొక్కలు పెంచడం
ఆరు విడతలుగా హరితహారం కార్యక్రమం ప్రారంభం: తొలివిడత హరితహారం కార్యక్రమాన్ని 2015 జూలై 3న చిలుకూరి బాలాజీ ఆలయ ప్రాంగణంలో, రెండో విడత హరితహారాన్ని 2016 జులై 8న నల్లగొండలో, మూడో విడత హరితహారాన్ని 2017 జూలై 12న కరీంనగర్ లో, నాలుగో విడత హరితహారాన్ని సీఎం సొంత నియోజకవర్గం అయిన గజ్వేల్లో 1 ఆగస్టు, 2018న సీఎం కేసీఆర్ స్వయంగా మొక్కలు నాటి, ఏకకాలంలో లక్షా 116మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2019 హరితహారం కార్యక్రమాన్నికూడా గజ్వేల్ లోనే ప్రారంభించారు. ఆరో విడత కార్యక్రమాన్ని 25 జూన్, 2020న మెదక్ జిల్లా నర్సాపూర్ రిజర్వ్ ఫారె్స్టలో సీఎం కేసీఆర్ అల్లనేరేడు మొక్కను నాటి ప్రారంభించారు.
ఆరు విడతల్లో నాటిన మొక్కల వివరాలు :
ఏటా కోట్లల్లో మొక్కలు నాటుతుండటంతో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. హరితహారానికి ముందు రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 24 శాతం ఉండేది. ఈ కార్యక్రమం చేపట్టిన ఐదేండ్ల వ్యవధిలోనే ఏకంగా అటవీ విస్తీర్ణం 4శాతం పెరిగి 28శాతానికి చేరుకున్నది. ఈ విషయాన్ని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియానే స్వయంగా ప్రకటించింది. మరో 5 శాతం పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 33శాతం అడవుల విస్తీర్ణం లక్ష్యం నెరవేరనున్నది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 217 కోట్ల మొక్కలు నాటడం జరిగింది.
మొక్కల పెంపకంలో తెలంగాణ నంబర్ వన్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం మంచి ఫలితాలనిచ్చింది. దేశంలోనే మొక్కల పెంపకంలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో పార్లమెంటులో ప్రకటించారు . 2014-15 నుంచి 2018-19 మధ్య చేపట్టిన హరితహారం కార్యక్రమంతో ఐదేళ్ళ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 15.21 లక్షల హెక్టార్లలో మొక్కలు నాటారు. దేశ వ్యాప్తంగా చేపట్టిన 81.33 లక్షల హెక్టార్ల అటవీకరణలో తెలంగాణ చేపట్టిన అటవీకరణ 18.70 శాతం(15.21 లక్షల హెక్టార్లు) అంటే దాదాపు 1/5 వంతుగా ఉంది. అటవీకరణకు దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం ఇంతగా చిత్తశుద్ధిని కనబరిచిన దాఖలాలు లేవు. 2015-16 నుండి 2020-21 సెప్టెంబర్ నాటికి 176.52 కోట్ల మొక్కలను తెలంగాణ రాష్ట్రంలో నాటారు.
సంవత్సరం ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ(హెక్టార్లలో)
2014-15 80,446 హెక్టార్లు
2015-16 2.36 లక్షల హెక్టార్లు
2016-17 4.38 లక్షల హెక్టార్లు
2017-18 4.89 లక్షల హెక్టార్లు
2018-19 2.76 లక్షల హెక్టార్లు
హరితహారం.. పచ్చదనం కోసం చేసిన ఖర్చు
2004 – 2014 వరకు 1245 కోట్ల రూపాయలు
2014 – 2020 వరకు 5230.06 కోట్ల రూపాయలు
ప్రతీ గ్రామంలో చెట్ల పెంపకాన్ని తప్పని సరి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది. కొత్తగా రూపొందించిన పంచాయతీ రాజ్ చట్టంలో ఇందుకు సంబంధించిన నిబంధనలు రూపొందించారు. ప్రతీ గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి, మొక్కలు నాటాలని, వాటిని రక్షించాలని, గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత పెంచాలని, ఇది గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి బాధ్యత అని చట్టంలో పేర్కొన్నారు.
మొదటి విడతలోనే ప్రభుత్వం రెండు గ్రామాలకు ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,213 నర్సరీలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టలో పచ్చదనం పెంపు, మొక్కలు నాటడాన్ని తప్పనిసరి చేస్తూ, ప్రతీ గ్రామానికి ఒక నర్సరీ ఏర్పాటును ప్రతిపాదించింది. హరితహారం కోసం 2020-21 సెప్టెంబర్ నాటికి సుమారుగా రూ.5 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఎండాకాలంలో మొక్కల రక్షణకు సుమారు 3,200 నీటి ట్యాంకర్లను ఉపయోగిస్తున్నారు. నర్సరీలలో, నాటిన మొక్కలలో 85 శాతం బతుకకపోతే సంబంధిత అధికారులపై చర్యలుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. నూతన పంచాయతీలు ఏర్పడిన నేపథ్యంలో మే 2021 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 13,768 నర్సరీలు ఉన్నాయి. 2013-14 లో కేవలం 102 నర్సరీలు మాత్రమే ఉండేవి.
హైదరాబాద్లో ప్రతి డివిజన్కు 3, 4 నర్సరీలు ఏర్పాటు చేస్తున్నారు. 2018-19 బడ్జెట్లో అటవీ, పర్యావరణ శాఖకు రూ.349.55 కోట్లు, 2020-21 బడ్జెట్లో రూ.791 కోట్లు కేటాయించింది. కనీసం 50 మొక్కలు, అంతకంటే ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటే వ్యక్తులకు, సంస్థలకు… ప్రత్యేకంగా ఆర్దిక సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి మొక్కకు రూ.5 చొప్పున ఆర్దిక సాయాన్ని అందిస్తోంది. గ్రామ హరిత రక్షణ కమిటీల ద్వారా మొక్కలను నాటే కార్యక్రమాన్ని.. మొక్కల సంరక్షణ కోసం చర్యలను తీసుకున్నది.
మొక్కలు నాటే పౌరులకు, యువజన, ప్రజా సంఘాలను, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. లక్ష్యాన్ని మించి మొక్కలు నాటే పంచాయతీలు, వార్డులు, మున్సిపాలిటీలకు రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ప్రోత్సాహకాలను అందిస్తున్నది. ప్రభుత్వానికి చెందిన నిరుపయోగ స్థలాల్లో నాటిన మొక్కల్లో 79 శాతం.. ఖాళీ స్థలాలు, పోరంబోకు భూముల్లో నాటిన మొక్కల్లో 53 శాతం మొక్కలు బతికినట్లు అంచనా.
2021 మే వరకు నాటిన మొక్కలు :
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. హరితహారంలో రాష్ట్రంలో మొత్తం 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, 2021 మే వరకు దాదాపు 217 కోట్ల మొక్కలను (అడవుల పునరుద్ధరణతో కలుపుకొని ) నాటడం జరిగింది. ఇందుకోసం రూ.5,230 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో బ్లాకులవారీగా పెంచినవి 43,276 హెక్టార్లు, అటవీ ప్రాంతాల రక్షణ కోసం తవ్విన కందకాలు 8,843 కిలోమీటర్లు. అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ కోసం వేసిన ఫారెస్ట్ లైన్లు 6,875 కిలోమీటర్లు. రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు (ఎవెన్యూ ప్లాంటేషన్ 7,522 కిలోమీటర్లు). మొత్తం 108 చోట్ల అర్బన్ ఫారెస్టులను ఏర్పాటు8 చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 33 పూర్తయ్యాయి. హెచ్ఎండీఏ పరిధిలో అర్బన్ ఫారెస్ట్ బ్లాకులు 188 (129 చోట్ల), ఇవి మొత్తం 1,66,660 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇందులో 59 ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి జరుగుతున్నది. మిగతా 70 ప్రాంతాలను కన్జర్వేషన్ జోన్లుగా తీర్చిదిద్దుతున్నారు.
హరితహారం వల్ల రాష్ట్రంలో పచ్చదనం 3.67 శాతం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. కలప స్మగ్లింగ్ పూర్తిగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. స్మగ్లర్ల పై పిడి యాక్టు కింద కేసులు నమోదు చేస్తన్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని 90 చోట్ల అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల అభివృద్ధి జరుగుతున్నది. పట్టణ ప్రాంతాలకు సమీపంలోని అటవీ ప్రాంతాలను గుర్తించి అర్బన్ పార్కులుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
అడవికి పూర్తిస్థాయి రక్షణ, ఆదివాసీ, గిరిజన రైతుబిడ్డలకు భరోసా, ప్రభుత్వభూమి లెక్కల్లో పారదర్శకత, కబ్జాదారుల కట్టడి లక్ష్యాలుగా తెలంగాణ ప్రభుత్వం అడవి లెక్కలు తేల్చాలని నిర్ణయించింది. రెవెన్యూ సర్వేయర్లు, అటవీ అధికారులతో కూడిన స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలు 2019 జనవరి మొదటివారంలో అటవీ భూముల సర్వే మొదలు పెట్టింది. రాష్ట్రంలో అడవుల లెక్క పక్కాగా ఉండాలని, పోడురైతులకు ఇబ్బందులు ఉండకుండా, ప్రభుత్వ శాఖల మధ్య సరిహద్దు తగాదాల్లేకుండా చూడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. రెవెన్యూ, అటవీ అధికారుల సంయుక్త సర్వేతో ప్రభుత్వానికి, రైతులకు, అటవీశాఖకు లబ్ధి చేకూరనున్నది. రాష్ట్రంలో అపరిష్కృతంగాఉన్న అతిపెద్ద సమస్య పరిష్కారమవుతుంది.
రాష్ట్ర భూభాగంలో 33 శాతం అటవీభూమి పక్కాగా ఉండేలా తెలంగాణ సర్కారు చర్యలు తీసుకుంటున్నది. అటవీ భూముల్లో వివాదాలు లేకుండా 41.75లక్షల ఎకరాలు ఉండగా, 25లక్షల ఎకరాల భూమిని సర్వేచేసి రికార్డులు సరిచేయాల్సి ఉన్నది. జయశంకర్ భూపాలపల్లి, నాగర్కర్నూల్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ భూములు అధికంగా ఉన్నాయి. పక్కాగా రికార్డులున్న 41.75 లక్షల ఎకరాలు.. రెవెన్యూ రికార్డుల్లో ఫారెస్ట్, అడవి, పోరంబోకు, జంగ్లత్, మహషుర తదితర పేర్లతో ఉన్నాయి. ఆయా పేర్లతో ఉన్న భూములన్నింటినీ సరిచేసి అటవీభూమి అంతా పహాణీలో అడవి అనే ఒకే పేరుతో నమోదుచేయాలని నిర్ణయించారు. ఈ భూములన్నింటినీ సెక్షన్22 (ఏ) ప్రకారం నిషేధిత భూముల జాబితాలో చేర్చి నిర్దిష్టంగా మ్యాపింగ్ చేసి, హద్దులు నిర్ణయిస్తారు.
అటవీ ప్రాంతాల్లోని ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం
అటవీ, రెవెన్యూ అధికారులు చేపట్టే జాయింట్ సర్వేద్వారా షెడ్యూల్డ్ తెగలు, ఆటవీవాసుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షల ఎకరాల్లో పోడు వ్యవసాయం జరుగుతున్నదని అంచనా. ఈ భూముల్లో తమకు పట్టాలు ఇవ్వాలంటూ షెడ్యూల్డ్ తెగలు, ఇతర ఆటవీవాసుల అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 కింద 2010 నుంచి 1,83,252 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఆదివాసీలతోపాటు, ఆదివాసేతరులున్నారు. నాటి ప్రభుత్వాలు గిరిజనేతరుల దరఖాస్తులను పరిశీలించలేదు. ఆదివాసీల దరఖాస్తుల్లోనూ సగం భూమికే పట్టాలు ఇచ్చారు. ఇలా 93,639 మంది ఆదివాసీ రైతులకు చెందిన 3,00,284 ఎకరాల భూములకు అటవీ హక్కుపత్రాలు (ఆర్వోఎఫ్ఆర్) ఇచ్చారు. దాదాపు 90 వేల దరఖాస్తులను పెండింగ్లో ఉంచారు.
అటవీ విస్తరణకు ‘డ్రోన్ సీడింగ్’ – 18.02.2020
పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా అటవీశాఖ వినూత్న ప్రయోగం ప్రారంభించింది. బంజరు భూములు, బహిరంగ ప్రదేశాల్లో అడవుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలనే సీఎం కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా టీ-వర్క్స్ డ్రోన్ సీడింగ్ను అభివృద్ధిచేసింది. పర్యావరణ అటవీప్రాంతాల్లో డ్రోన్ తో విత్తనాలు చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్కు చెందిన మారుత్ సంస్థ తయారుచేసిన డ్రోన్తో సిరిసిల్ల సమీపంలోని వీర్నపల్లి గ్రామ శివారులో 17 ఫిబ్రవరి, 2020న ఒకేరోజు 15 వేల విత్తన బంతులను చల్లి రికార్డు సృష్టించింది. భవిష్యత్లో రాష్ట్రమంతటా అడవుల పునరుద్ధరణకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు.
సర్వేయర్లకు శిక్షణ
అటవీభూములకు హద్దులు నిర్ణయించేందుకు 550 మంది సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నారు. వీరంతా జనవరి మొదటివారం నుంచి అందుబాటులోకి వస్తారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక పరిస్థితులు ఉంటాయని అంచనా వేసిన ఉన్నతాధికారులు జిల్లాల పరిస్థితులను బట్టి సర్వేచేస్తారు. శిక్షణపొందిన సర్వేయర్లతోపాటు అటవీ, రెవెన్యూ సిబ్బంది బృందాలతో కలిపి కంపోజిషన్ ఆఫ్ స్పెషల్ టాస్క్ఫోర్స్ టీంలను ఏర్పాటుచేస్తారు. పదవీ విరమణ చేసిన అటవీ అధికారులు, సిబ్బంది సర్వీసులను కూడా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వన్యప్రాణుల సంరక్షణ బోర్డు
రాష్ట్ర వన్యప్రాణుల సంరక్షణ బోర్డును 18 డిసెంబర్, 2019న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బోర్డు చైర్మన్ గా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యవహరించే ఈ బోర్డులో వైస్ చైర్మన్ గా అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సభ్యులుగా ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, మర్రి జనార్ధన్ రెడ్డి, వనమా వెంకటేశ్వర్ రావు, వైల్డ్ లైఫ్ ఎన్జీవో నుంచి అనిల్ కుమార్, జెవీడీ మూర్తి, అవినాశ్ విశ్వనాథన్, పర్యావరణ వేత్తలు డాక్టర్ కార్తికేయన్, వి.కిషన్, డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ వాసుదేవరావు, ఎస్.రాఘవేందర్, బీవీ సుబ్బారావు, కార్తీక్ చింతలపాటి రాజు, రాజీవ్ మ్యాథ్యూస్, కోవా లక్ష్మి, బానోతు రవికుమార్ ఉన్నారు. వీరితో పాటు మరో 13 మంది బోర్డులో సభ్యులుగా ఉంటారు.
పట్టణవాసుల కోసం ఆక్సిజన్ పార్కులు
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లను ఆక్సిజన్ పార్కులు (అర్బన్ లంగ్స్ స్పేస్)గా అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడవుల ప్రాముఖ్యతను గుర్తించి ఈ పార్కులకు ప్రోత్సాహం అందిస్తున్నది. గ్రేటర్ పరిధిలో నారపల్లి (భాగ్యనగర నందనవనం), మేడిపల్లి (చెంగిచర్ల వెళ్లే దారిలో), కండ్లకోయ రిజర్వ్ ఫారెస్ట్ లను నూతనంగా అభివృద్ధి చేశారు.రాష్ట్రంలో 30 రిజర్వ్ ఫారెస్ట్లను అర్బన్ లంగ్స్ స్పేస్లుగా అభివృద్ధి చేశారు.
కొత్తగా 1,799 అర్బన్ పార్కులు
పట్టణాల్లో పచ్చదనం పెంపునకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. పట్టణాల్లో గతంలో ఒక్క నర్సరీ కూడా ఉండేవికావు. తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నంగా మున్సిపాలిటీల్లో వెయ్యి నర్సరీల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో సెప్టెంబర్ 2020 నాటికి 1,893 అర్బన్ పార్కులు ఉన్నాయి. వాటికి అదనంగా కొత్తంగా 1,799 పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో 797 పార్కుల పనులను పూర్తిచేశారు. మొత్తంగా జీహెచ్ఎంసీలో 587 పార్కులు, ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 1,109, హెచ్ఎండీఏ పరిధిలో 103 పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. ఆ పార్కుల్లో కొన్నింటిని ట్రీపార్కులు, ల్యాండ్స్కేప్ పార్కులు, మరికొన్నింటిని లంగ్స్పేస్ పార్కులుగా తీర్చిదిద్దనున్నారు. కాంపా నిధులను వాటి నిబంధనలకు అనుగుణంగా మున్సిపల్ పార్కుల అభివృద్ధికి వినియోగించనున్నారు.
రాష్ట్రంలో 19,470 ప్రకృతి వనాలు ( డిసెంబర్ 2020 )
రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఓ ప్రకృతి వనం ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం సంకల్పం ఊపందుకొన్నది. రాబోయే రోజుల్లో పక్షులు, పిచ్చుకలు, ఇతర జీవాలు అంతరించిపోయే ప్రమాదమున్న నేపథ్యంలో వాటిని కాపాడుకొనేందుకు 20,050 ఆవాసాల్లో పల్లె ప్రకృతి వనాలను గ్రామీణాభివృద్ధిశాఖ ఏర్పాటు చేస్తున్నది. ఒక్కో వనంలో యాదాద్రి మియావాకి పద్ధతిలో 4 వేల రకాల స్థానిక జాతి మొక్కలను నాటుతున్నారు. ఇప్పటికే 10,627 వనాల్లో మొక్కలు నాటే ప్రక్రియ పూర్తయ్యింది. అర్బన్ పార్కులకు తీసిపోకుండా ఓపెన్ ఎయిర్ జిమ్లు, పిల్లల ఆట స్థలం, యోగా, మెడిటేషన్ కేంద్రాలు, వాకింగ్ ట్రాక్లు మొదలైన వసతులతో పార్కులు ఏర్పాటవుతున్నాయి. గ్రామాల్లో అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి పల్లె ప్రకృతి వనాలకు అరెకరంలో రూ.4 లక్షలు, 3/4 వంతు ఎకరంలో రూ. 5.3 లక్షలు, ఎకరంలో రూ.6.3 లక్షలు మంజూరు చేస్తున్నారు. మొక్కలు నాటడంతోపాటు రాబోయే రెండేండ్లపాటు వాటి నిర్వహణకు ప్రభుత్వం రూ.771 కోట్లు కేటాయించింది.
కాలనీల్లోని పార్కుల్లో ఓపెన్ జిమ్లు
ప్రభుత్వం మున్సిపాలిటీల ఆధ్వర్యంలోని పార్కుల్లో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నది. భవిష్యత్లో కాలనీలు, రెసిడెన్షియల్ పరిధిలోని పార్కుల వద్ద స్థలం ఉంటే ఓపెన్జిమ్లు ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వాటితోపాటు టాయిలెట్లు, ఇంకుడు గుంతలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. రీసైక్లింగ్ వాటర్, ఎస్టీపీల నుంచి ట్రీట్ అయిన వాటర్ను రీసైక్లింగ్చేసి పార్కులకు వాడేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. కేబీఆర్ పార్కు ఒక్కటే కాకుండా పట్టణవాసుల కోసం పదుల సంఖ్యలో మానసికోల్లాసం, సైక్లింగ్, పాలపిట్ట పార్కులను ఏర్పాటుచేస్తున్నారు. మహబూబ్నగర్లో 2,780 ఎకరాల్లో అతిపెద్ద అర్బన్ ఎకో పార్కును ఏర్పాటు చేశారు.
అర్బన్ ఫారెస్టుల్లో షూటింగులకు అనుమతి
అర్బన్, గ్రామీణ పార్కుల్లో సినిమాలు, సీరియళ్ల షూటింగులకు అనుమతులిస్తామని అటవీశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. నిర్మల్ గండిరామన్న హరితవనంలో 2020 జూలై 27న ఆయన సీరియల్ షూటింగును ప్రారంభించారు. షూటింగుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి భారీగా ఖర్చు పెట్టే నిర్మాతలు.. కరోనా పరిస్థితుల్లో మన ప్రాంతంలో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటున్నారని మంత్రి తెలిపారు.
పట్టణాల్లో పార్కుల అభివృద్ధి : రాష్ట్రవ్యాప్తంగా 72 పట్టణ స్థానిక సంస్థల్లో 2,971 ఖాళీ స్థలాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. దాదాపు 1,565 ఎకరాలను పచ్చదనంగా మార్చడానికి రూ.250 కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. 35 పట్టణాలకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో చిన్నారుల కోసం ప్రత్యేకంగా 58 పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. 44 ట్రీ పార్కులు, 138 చిన్న పార్కులు, 44 టౌన్ పార్కుల రూపురేఖలను సంపూర్ణంగా మార్చివేస్తున్నారు.
500 కోట్లతో పట్టణ అటవీ పార్కులు
హైదరాబాద్ నగరంలో 59 పట్టణ ఆటవీ పార్కులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. పార్కుల్లో సౌకర్యాలు కల్పించడానికి, అడవిని కాపాడేందుకు ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తున్నారు. ఆటవీశాఖ 15, జీహెచ్ఎంసీ 3, హెచ్ఎండీఏ 17, టూరిజం 7, అటవీ కార్పొరేషన్ 4, టీఎస్ఐఐసీ 11, మెట్రోరైల్ ప్రాజెక్టు 2 పార్కులను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నాయి. దీనికోసం రూ.500 కోట్లు వ్యయం చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, ఆవాసాల్లో ప్రకృతి వనాలు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ ఏర్పాట్లను వేగవంతం చేసింది. డిసెంబర్, 2020 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామాలు, 8,715 ఆవాసాల్లో కలిపి మొత్తం 19,470 ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబర్ 2020 నాటికి 10,323 గ్రామాల్లో స్థలాలను అందుబాటులోకి తెచ్చారు. వీటిలో 6254 చోట్ల పనులు మొదలయ్యాయి.
వానలకు, వనాలకు సంబంధం ఉన్నది. చెట్లు లేకుండా వర్షాలు రావు. అందుకే తెలంగాణ వ్యాప్తంగా అడవుల శాతాన్ని పెంచి, గ్రీన్ కవర్ పెంచాలని ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. అడవుల పునరుద్ధరణతో వ్యవసాయానికి లాభమని శాస్త్రీయంగా నిరూపితమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవక ముందు మొక్కల పెంపకం మొక్కుబడిగా సాగింది. అడవులను, మొక్కల పెంపకాన్ని నిర్లక్ష్యం చేశారు. 1980-2014 మధ్య.. అంటే 34 ఏళ్లలో తెలంగాణలో 3.17 కోట్ల మొక్కలు మాత్రమే నాటినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2004-2014 మధ్య పదేళ్లలో రూ.130 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఏడాదికి సగటున రూ. 13 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అటవీ భూమిని కూడా కాపాడలేదు. ఇదే సమయంలో 7.35 లక్షల ఎకరాల అటవీ భూమి అన్యాక్రాంతమైపోయింది. అడవులు అంతరించి పోయి, తెలంగాణలో వర్షపాతం తగ్గింది. ఈ పరిస్థితిలో మార్పు తేవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అడవుల సంరక్షణ – మొక్కల పెంపకం..
కొత్త అటవీ చట్టం : రాష్ట్రంలో అడవులు కాపాడే విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నది. అటవుల రక్షణకోసం ప్రభుత్వం కొత్త అటవీ చట్టం -2019 ని రూపొందిస్తున్నది. అటవీ చట్టం ముసాయిదాను అటవీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. ఆ చట్టం న్యాయశాఖ పరిశీలనలో ఉన్నది. తదనంతరం ప్రభుత్వం కొత్త అటవీ చట్టానికి ఆమోదం తెలుపనుంది. అడవులు నరికి, కలపను స్మగ్లించే వారికి నామమాత్రపు శిక్షలు, జరిమానాలు వుండేవి. చాలా అటవీ నేరాలు బెయిలబుల్ అఫెన్సులుగా వుండటంతో నేరగాల్లకు, స్మగ్లర్లకు అడ్డూఅదుపూ లేకుండా పోయేది. దీంతో ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు అడవుల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నూతన అటవీ చట్టాన్ని కఠినంగా రూపొందిస్తున్నారు.
అడవుల సంరక్షణ, మొక్కల పెంపకం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ 26 జనవరి, 2019న ప్రగతి భవన్ లో పోలీస్, అటవీశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అడవుల సంరక్షణ కోసం అధికారులకు కొన్ని సూచనలు ఇస్తూ వారికి దిశా నిర్దేశం చేశారు.
ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ప్రయత్నం – హరితహారం
మొదటిది: గ్రీన్ వాల్ ఆఫ్ చైనా
(గోబిఎడారి విస్తరించకుండా 4,500 కిలోమీటర్ల గ్రీన్ వాల్ ఏర్పాటుకు మొక్కలు నాటడం)
రెండవది: వన్ బిలియన్ ట్రీస్ ఇన్ అమెజాన్
( అమెజాన్ నది వెంట 100 కోట్ల మొక్కలు నాటడం )
మూడవది: తెలంగాణకు హరితహారం
( తెలంగాణ రాష్ట్రంలో 33 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా సామాజిక అడవులను పెంచడం )
తెలంగాణలో 67 లక్షల ఎకరాల్లో (24 శాతం) ఉన్న అడవిని రక్షించడం, పోయిన అడవిని పునరుద్ధరించడం హరితహారం ఉద్దేశం. 5,151 కి.మీ. మేర నేషనల్ హైవేస్, ఆర్ అండ్ బి రోడ్ల పక్కన 5,500 కి.మీ. మేర పంచాయతీ రాజ్ రోడ్ల పక్కనచెట్ల పెంపకాన్ని చేపట్టి, రక్షణకు ట్రీ గార్డుల ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛందంగా 4 కోట్ల సీడ్ బాల్స్ తయారుచేసి, అటవీభూముల్లో, కొండలు, గుట్టల్లో వీటిని చల్లించడం జరిగింది. హరితహారం కార్యక్రమం ద్వారా 2019-20 లో 9.63 లక్షల ఎకరాల అడవి పునరుద్ధరణ జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా ‘హరిత పాఠశాల’
హరితహారం నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా తేదీ 25 ఆగస్టు 2018 రోజున రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో ‘హరిత పాఠశాల’ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలోని 37 వేల పాఠశాలలు, 404 జూనియర్ కాలజీలు, 130 డిగ్రీ కాలేజీలు, 55 పాలిటెక్నిక్ కళాశాలల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 30 లక్షల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రజల భాగస్వామ్యం – హరితమిత్ర అవార్డులు
హరితహారం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నుంచి పాఠశాల విద్యార్థి దాకా భాగస్వామ్యం కల్పించాలని భావించిన సీఎం కేసీఆర్ గ్రీన్ బ్రిగేడియర్ ల ఏర్పాటు కోసం పిలుపుచ్చారు. దీంతో మొత్తం 30,809 బృందాలు ఏర్పాటు చేసి, 4.81 లక్షల సభ్యులను చేర్పించారు. అలాగే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో హరితమిత్ర అవార్డులు ప్రకటించారు. రూ. 15 కోట్లతో 523 హరితమిత్ర అవార్డులు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు.
పర్యావరణ పరిరక్షణకు సీడ్ గణేష్ కార్యక్రమం
హరితహారంలో భాగంగా వినాయక చవితి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఎంపీ సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా చేపట్టిన సీడ్ గణేష్ వినూత్న కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ 5 ఆగస్టు 2020న ప్రారంభించారు. ఆధ్యాత్మికతకు, ప్రకృతి, పర్యావరణ రక్షణను జోడించడమే సీడ్ గణేష్ కార్యక్రమం సంకల్పం. స్వచ్ఛమైన మట్టిలో వేప విత్తనాన్ని కలిపి తయారు చేసిన గణపతి విగ్రహాలను అందరికీ పంపిణీ చేస్తారు. నవరాత్రులు పూర్తయ్యాక ఈ మట్టి విగ్రహాన్ని ఇంట్లోనే మొక్కగా నాటుకోవచ్చు.
అటవీశాఖ బలోపేతం
గతంలో ప్రభుత్వాలు అటవీ శాఖపై నిర్లక్ష్యం చూపేవి. దశాబ్దాలుగా నియామకాలు లేక 50 శాతం పోస్టులు ఖాళీగా ఉండి, లక్ష్యానికి గండి పడేది. ఈ క్రమంలో ఇప్పుడు 2,085 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ రాగా, 67 రేంజ్ ఆఫీసర్ పోస్టులు, 1,857 బీట్ ఆఫీసర్ పోస్టులు, కిందిస్థాయి ఇతర పోస్టులు అదనంగా మంజూరు చేయడం జరిగింది. ఈ క్రమంలో అటవీ శాఖను పునర్వ్యవస్థీకరించారు. తెలంగాణలో గతంలో 28 ఫారెస్టు డివిజన్లుంటే, వాటిని 37 వరకు, రేంజ్ ల సంఖ్యను 106 నుండి 185కు, 469 సెక్షన్లను 831 వరకు, బీట్ల సంఖ్యను 1,428 నుండి 3,132 వరకు పెంచారు. అడవిలో చెట్ల నరికివేతను ప్రభుత్వం నిరోధించ గలిగింది. గతంలో ఏడాదికి సగటున 15 వేల వరకు ఇలాంటి సంఘటనలు జరిగితే, ఇప్పుడు వాటి సంఖ్య 5 వేలకు తగ్గింది. హరితహారం కోసం ప్రభుత్వం రూ.2,008 కోట్లు ఖర్చు చేసింది.
సిద్దిపేట జిల్లా ములుగులో ఫారెస్ట్ కాలేజీ
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా సిద్దిపేట జిల్లా ములుగులో రూ. 75 కోట్లతో ఫారెస్టు కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ను 2016లో నెలకొల్పింది. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేసే ఈ కాలేజీ ద్వారా విద్యార్థులకు అటవీ సంపద, అటవీ ఉత్పత్తులు, అటవీ జాతుల గురించి అవగాహన కల్పించడానికి, పర్యావరణ సమతుల్యం పెంచే మార్గాలపై పరిశోధన చేయడానికి అవకాశం కలుగుతుంది. దక్షిణ భారతదేశంలో కోయంబత్తూరు సమీపంలోని మెట్టుపాలయంలోనే అటవీ కళాశాల ఉంది. అక్కడ చదివిన వారిలో 100 మంది ఐఎఫ్ఎస్ అధికారులుగా దేశానికి సేవలందిస్తున్నారు. ములుగులో రూ.75 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ కళాశాల వల్ల ఇక్కడి విద్యార్థులు అటవీ అధికారులుగా, అఖిల భారత సర్వీసుల్లో పనిచేయడానికి వీలవుతుంది.
తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ విద్యార్థినులకు అమెరికా వర్సిటీలో ఫ్రీ సీట్లు
తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్లో చదివిన ఇద్దరు విద్యార్థినులు అమెరికాలోని ప్రఖ్యాత అబర్న్ యూనివర్సిటీలో ఫ్రీ సీట్లు సాధించారు. సూర్య దీపిక, సుహర్ష అనే ఇద్దరు విద్యార్థినులకు ఈ యూనివర్సిటీ రూ.22.5 లక్షల ట్యూషన్ ఫీజు మినహాయింపునివ్వడమే గాకుండా, నెలకు రూ.1.12 లక్షల చొప్పున రెండేండ్లపాటు స్కాలర్ షిప్ కూడా ఇవ్వనున్నట్లు పేర్కొన్నది.
విద్యార్థినులను అభినందించిన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
అమెరికాలోని ప్రతిష్టాత్మక అబర్న్ విశ్వవిద్యాలయంలో సీట్లు సాధించిన సూర్య దీపిక, సుహర్షలను 2020 జూలై 26న కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అభినందించారు. ప్రపంచంలోని గొప్ప విశ్వవిద్యాలయంలో సీట్లు సాధించిన వీరి ప్రతిభపై హర్షం వ్యక్తం చేస్తూ కేంద్రమంత్రి ట్వీట్ చేశారు.
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ (ఎఫ్.ఆర్.ఓ) ల ఉద్యోగ దరఖాస్తు వయోపరిమితి పెంపు
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ (ఎఫ్.ఆర్.ఓ) ఉద్యోగం కోసం దరఖాస్తు చేసే అభ్యర్ధుల వయో పరిమితిని మూడేళ్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఫైల్ పై ముఖ్యమంత్రి 2017 సెప్టెంబర్ 13న సంతకం చేశారు. దీంతో వయో పరిమితి 28 నుంచి 31 సంవత్సరాలకు పెరిగింది.
2020 జూన్ 25 నుంచి ఆరో విడత హరితహారం
తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని 2020 జూన్ 25 నుంచి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తున్నది. ఇందుకోసం 12,753 నర్సరీల్లో 25 కోట్ల మొక్కలను సిద్ధంగా ఉంచింది. గుంతల తవ్వకం పనులు కూడా పూర్తయ్యాయి. హరితహారం కార్యక్రమాన్ని ఉపాధిహామీకి అనుసంధానం చేయటంతో ఆ పథకంలో కూలీలకు మెరుగైన ఉపాధి లభిస్తున్నది. వర్షాలు మొదలుకాగానే గుంతలు తీసే కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారు. ఈసారి గ్రామాల్లో ఉపాధి కూలీల సంఖ్య గణనీయంగా పెరిగి, ఆ సంఖ్య ఇప్పటికే 25 లక్షలు దాటింది. ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం ట్రాక్టర్ను అందజేయడం హరితహారానికి ఎంతో మేలు చేస్తున్నది. గ్రామ సర్పంచ్లు ఆ ట్రాక్టర్ను ట్యాంకర్గా వాడి మొక్కలకు నీళ్లు పోస్తూ వాటిని బతికిస్తున్నారు.
నేరేడు మొక్కనాటి ఆరోవిడత హరితహారం ప్రారంభించిన సీఎం కేసీఆర్ (25 జూన్ 2020)
ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని 25 జూన్ 2020న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లాలోని నర్సాపూర్ అటవీప్రాంతంలో నేరేడు మొక్కను నాటి ప్రారంభించారు. అక్కడే 630 ఎకరాల్లో అభివృద్ధి చేసిన అర్బన్ ఫారెస్ట్ ను కూడా ప్రారంభించారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 కోట్ల మొక్కలు నాటనున్నారు. 34 శాఖల సమన్వయంతో రాష్ట్ర అటవీశాఖ ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికే ఎక్కడికక్కడ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామ గ్రామాన హరితహారం జోరుగా కొనసాగుతుంది.
నర్సాపూర్ అడవుల్లో చేపట్టిన అటవీ అడవి పునరుద్ధరణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాలయిన ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రమే ప్రస్తుతం అడవి ఉందని, ఆ ప్రాంతం కాక దట్టమైన అడవి వున్న ఏకైక ప్రాంతం నర్సాపూర్ ఫారెస్టును కాపాడుకోవాలని సీఎం కోరారు. పోయిన అడవిని పునరుద్ధరించడానికి అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు.
పాలమూరులో దేశంలోనే అతిపెద్దదైన కేసీఆర్ ఎకో పార్కు ప్రారంభం
పాలమూరులోని రిజర్వు పార్కు పరిధిలో 2,087 ఎకరాల్లో విస్తరించిన దేశంలోనే అతిపెద్దదైన కేసీఆర్ ఎకో పార్కును మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ 14 జూలై 2020న ప్రారంభించారు. ఇంతవరకు కోల్ కతాలో వెయ్యి ఎకరాల్లో విస్తరించిన మెయిడెన్ పార్కు దేశంలోనే అతిపెద్ద ఎకో పార్కుగా ప్రసిద్ధి చెందింది. రెండోదిగా జంషెడ్ పూర్ లో 500 ఎకరాల్లోని జూబ్లీ పార్కు ఉండగా, లక్నోలో 376 ఎకరాల్లో విస్తరించిన మిశ్రా పార్కు మూడోస్థానంలో ఉన్నాయి.
రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో హరితహారం
2020-21 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెండు లక్షల మొక్కలు నాటాలని కార్యాచరణ రూపొందించారు. అలాగే, రాష్ట్రంలో 130కిపైగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో బొటానికల్ గార్డెన్ల ఏర్పాటుకు. 54 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో స్థలాన్నిబట్టి మొక్కలు పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
వాచ్ అండ్ వార్డు సిబ్బంది నియామకం
హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించడానికి వాచ్ అండ్ వార్డు సిబ్బందిని ప్రభుత్వం నియమించనుంది. ఈ మేరకు రాష్ట్రపంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు అధికారులను ఆదేశించారు. మొక్కల సంరక్షణపై సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వాలని కోరారు. అటవీశాఖకే 263 ఎకరాలు బదిలీ
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలంలో కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం గతంలో అటవీ భూములను సేకరించి మెట్రో వాటర్ సప్లై, సీవరేజీ బోర్డుకు అప్పగించింది. దీనికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరంలో 90.25 ఎకరాలు, హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ లో 128 ఎకరాలు, ఉమ్మాపూర్ లో 45 ఎకరాలను( 263.25 ఎకరాల భూమిని) అటవీశఆఖకు బదలాయించింది.
…………………………………………………..
హరితహారం ముఖ్యమైన ముఖ్యాంశాలు :
తెలంగాణకు హరితహారం
ఆరవ విడత (2020-2021)
ప్రారంభం : 25 జూన్ 2020
లక్ష్యం : 30 కోట్ల మొక్కలు
ప్రధాన కార్యక్రమాలు
1. సామాజిక అడవుల పెంపకం
2. అడవుల రక్షణ – పునరుద్ధరణ
3. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు
4. రహదారుల వెంట మొక్కల పెంపకం
పచ్చదనం పెంచడానికి తీసుకున్న చర్యలు
1. కొత్త చట్టాలు : పంచాయతీ రాజ్, మున్సిపల్
2. 85 శాతం బతకడం ప్రజాప్రతినిధుల బాధ్యత
3. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో హరితహారం
4. ప్రతీ గ్రామానికి తప్పని సరిగా నర్సరీ
5. ప్రతీ గ్రామానికి తప్పని సరి ఒక ట్రాక్టర్
6. మున్సిపాలిటీలలో ప్రతీ వార్డుకు ఒక నర్సరీ
7. 30 కిలోమీటర్లకు ఒక హైవే నర్సరీ
8. జిల్లా స్థాయి గ్రీన్ కమిటీలు – కలెక్టర్ అధ్యక్షతన
9. గ్రామ, పట్టణ, జిల్లా స్థాయి హరిత ప్రణాళిక
10. గ్రీన్ ఫండ్ ఏర్పాటు
11. ఇంటింటికి ఆరు మొక్కలు
12. మంకీ ఫుడ్ కోర్టులు : 4,772 ఎకరాలు
37 రకాల పండ్ల మొక్కలతో ఫుడ్ కోర్టులు
13. గ్యాప్ ఫిల్లింగ్ : గత ఐదు విడతల్లో నాటిన ప్రాంతాల్లో చనిపోయిన, సరిగా ఎదగని మొక్కలను గుర్తించి మార్పు చేయటం.
14. ఆగ్రో ఫారెస్ట్రీకి అధిక ప్రాధాన్యత- రైతులకు అదనపు, ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల పెంపు.
15. కేంద్ర ప్రభుత్వ బ్యాంబూ మిషన్ ( వెదురు ప్రోత్సాహక సంస్థ) సహకారంతో చిన్న, సన్నకారు రైతులకు ఆదాయ వనరుగా వెదురు పెంపకం హరితహారం కింద ప్రోత్సాహం.
16. నరేగా ద్వారా పచ్చదనం పెంచే పనులు
17. అటవీశాఖ సిబ్బంది పెంపు : కొత్తగా 1973 మంది నియామకం. (60 మంది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 90 మంది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, 1823 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు)
18. 2019-20 నాటికి అటవీశాఖకు కొత్తగా 2,574 వాహనాలను సమకూర్చారు. 2013-14లో కేవలం 431 వాహనాలు మాత్రమే ఉండేవి.
19. గ్రీన్ బ్రిగేడ్. నాటిన మొక్కల సంరక్షణ స్థానిక ప్రజా ప్రతినిధులు,ప్రజలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రత్యేకంగా కోరుతోంది. అన్ని ప్రాంతాల్లో గ్రీన్ బ్రిగేడ్ లకు సంరక్షణ బాధ్యతలు అప్పగించారు.
20. ప్రోత్సాహకాలు: మొక్కలు నాటే పౌరులకు, యువజన, ప్రజా సంఘాలను, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఇస్తోంది.
అడవుల రక్షణ – పునరుద్ధరణ
జంగల్ బచావో – జంగల్ బడావో
– 66.64 లక్షల ఎకరాలు – ఇది రాష్ట్ర విస్తీర్ణంలో 24 శాతం
– ఇందులో దట్టమైన అడవి 30 శాతం మాత్రమే
– ఒకప్పుడు తెలంగాణలో ఎటు చూసినా పెద్ద అడవులు
– ఇప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితం
– నర్సాపూర్ లో ఒకప్పుడు పెద్ద అడవి
– గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అడవి సర్వనాశనం
– స్మగ్లర్ల చేతికి అడవులు అప్పగించారు
– అటవీ భూములు అన్యాక్రాంతమైనా పట్టించుకోలేదు
– సామాజిక అడవులు ఎంత పెంచినా అడవుల ద్వారా వచ్చే సహజ పచ్చదనం రాదు
– పది ఎకరాల్లో పెంచే సామాజిక వనాలు మూడు ఎకరాల్లో పెంచే అడవికి సమానం.
అడవి పునరుద్ధరణ లక్ష్యం
– 1706 బ్లాకుల్లో 21 లక్షల ఎకరాల పునరుద్దరణ లక్ష్యం.
– 8.65 లక్షల ఎకరాల్లో పూర్తి, ఈ యేడాది ఒక 2.10 లక్షల ఎకరాలు లక్ష్యం.
– ఇంకా 10.25 లక్షల ఎకరాల్లో దశల వారీగా పూర్తి
అడవి రక్షణకు చర్యలు
– అటవీ భూమికి హద్దులు
– అటవీ బ్లాకుల రక్షణకు కందకాల తవ్వకం, వాటిపై గచ్చకాయల చెట్లు
– పట్ణణ ప్రాంతాల్లో ఫెన్సింగ్, సీ త్రూ వాల్స్ నిర్మాణం
– స్మగ్లర్లపై కఠిన చర్యలు – పిడి యాక్టు
– అటవీ శాఖ అధికారులకు రక్షణ
పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
– తెలంగాణ పట్టణ జనాభా ఎక్కువున్న రాష్ట్రం
– రాష్ట్రంలో 141 పట్టణ స్థానిక సంస్థలు (యు.ఎల్.బి.) ఉన్నాయి
– పట్టణాల్లో కాలుష్యం ఎక్కువ, పచ్చదనం తక్కువ
– పట్టణాల్లో వత్తిడి ఎక్కువ, ప్రజలకు అనేక రుగ్మతలు
– పట్టణాల్లో పచ్చదనం పెంచడానికి ప్రత్యేక ప్రణాళిక
– పట్టణాల్లో మొత్తం 12.5 కోట్ల మొక్కలు లక్ష్యం
– హెచ్ఎండిఏ పరిధిలో 5 కోట్లు, జిహెచ్ఎంసి పరిధిలో 2.5 కోట్లు, అన్ని పట్టణాల్లో కలిపి 5 కోట్ల మొక్కలు
– పట్టణ ప్రాంతాల్లో అటవీ భూమి మొత్తం 10.82 లక్షల ఎకరాలు. హెచ్ఎండిఏ పరిధిలో 188 బ్లాకుల్లో 1.60 లక్షలు, మున్సిపాలిటీల పరిధిలో 9.22 లక్షల ఎకరాలు
– అర్బన్ ఫారెస్ట్ పార్కులు – 95 అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల అభివృద్ది. (32 పూర్తి అయ్యాయి, 42 ఈ ఏడాది పునరుద్ధరణ. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి)
ప్రధాన రహదారుల వెంట పచ్చదనం
– హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-ముంబాయి, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-బెంగుళూరు, హైదరాబాద్-నాగపూర్ వంటి జాతీయ రహదారుల కిరువైపులా ఇప్పటికే పెద్ద పూల చెట్లు నాటారు.
– రహదారుల వెంట మిగిలిన ప్రాంతాల్లో హరితహారం. పట్టణ ప్రాంతాలతో పాటు, ప్రతీ గ్రామానికి దారి తీసే రోడ్ల వెంట అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని నిర్ణయం
– ప్రతీ 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున నర్సరీలు
– మున్సిపాలిటీలు, అన్ని పంచాయితీ రోడ్లు వెంట నీడను ఇచ్చే మొక్కలతో పాటు, పూలతో ప్రయాణం అహ్లాదంగా ఉండాలనేది లక్ష్యం.
– ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 7,409 కిలో మీటర్ల మేర రహదారుల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్ పూర్తయింది.
6వ విడత హరితహారం అంశాలు
– తెలంగాణలో పచ్చదనాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచే లక్ష్యం
– కరోనా ప్రభావం ఉన్నప్పటికీ అనుకున్న ఆకుపచ్చని లక్ష్యం నెరవేరాలనే పట్టుదలతో ఆరవ విడత కార్యక్రమం
– ఈ ఏడాది మొక్కలు నాటే లక్ష్యం 30 కోట్లు
– ఈ విడతలో టేకు, సరుగుడు, చింత, పూలు, పండ్ల మొక్కలకు ప్రాధాన్యత.
– యాదాద్రి మోడల్ అటవీ విధానం : పట్టణ, కొండ ప్రాంతాల్లో మియావాకీ పద్దతిలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలతో చిట్టడవులను పెంచటం.
– స్కూళ్లు, కాలేజీలు, సంక్షేమ హాస్టళ్లు, యూనివర్సిటీ క్యాంపస్ లు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో హరితహారం.
– సామాజిక ప్రాంతాలు, స్మశానాలు, చెరువులు, కాలువలు, ప్రాజెక్టుల వద్ద హరితహారం.
– ప్రతీ ఊరిలో ఒక చిన్న పార్కు, కనీస వసతులతో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు.
– ప్రతీ నియోజకవర్గంలో ఉన్న అడవుల పునరుద్దరణ లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు పనిచేయటం.
– ఒకే రకం చెట్లు కాకుండా నీడనిచ్చేవి, పండ్లు- పూల చెట్లు, ఔషధ మొక్కలు నాటుతున్నారు
– అన్ని రహదారులకు ఇరువైపులా, విద్యాలయాల్లో, పోలీస్ ప్రాంగణాల్లో, మార్కెట్ యార్డుల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో, శ్మశాన వాటికలు, పరిశ్రమల్లో, పారిశ్రామిక వాడల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో మొక్కలు
– ఏడాది పొడగునా మొక్కల సంరక్షణ
– ప్రతీ నెలా ఆ మొక్కల ఎదుగుదలను, బతికిన మొక్కల శాతాన్ని నమోదు చేయాలి
– ప్రతీ డిపార్ట్ మెంట్ ప్రాంతాల వారీగా కొందరు ఉద్యోగులతో బృందాలను ఏర్పాటు చేసి, వారంలో ఒక రోజు మొక్కల (ప్రతీ శుక్రవారం – గ్రీన్ ఫ్రైడే) పర్యవేక్షణకు కేటాయించాలి.
– చింత మొక్కలు : కోటి మొక్కలు సిద్ధం
గ్రీన్ ఫండ్ – పచ్చదనం పెంచడానికి నిధులు
2019-20 వరకు ఐదేళ్లలో చేసిన ఖర్చు : 4,315 కోట్ల రూపాయలు
2020-21 ప్రణాళిక : 2,103 కోట్ల రూపాయలు
603 కోట్లు : కాంపా నిధులు
300 కోట్లు : రాష్ట్ర బడ్జెట్
332 కోట్లు : గ్రామీణ స్థానిక సంస్థల గ్రీన్ ఫండ్
173 కోట్లు : పట్టణ స్థానిక సంస్థల గ్రీన్ ఫండ్
275 కోట్లు : జిహెచ్ఎంసి
500 కోట్లు : నరేగా
తెలంగాణకు హరితహారం – ఐదు విడతల పురోగతి
గత ఐదేళ్లలో నాటిన మొత్తం మొక్కలు – 151.77 కోట్లు
అటవీ పునరుద్దరణ కోసం అడవుల్లో నాటినవి- 30.97 కోట్లు
రాష్ట్ర వ్యాప్తంగా నాటిన మొత్తం మొక్కలు – 211.71 కోట్లు
2015-16 : 15.86 కోట్లు
2016-17 : 31.67 కోట్లు
2017-18 : 34.07 కోట్లు
2018-19 : 32 కోట్లు
2019-20 : 38.18 కోట్లు
2020-21 లక్ష్యం : 59.93 కోట్ల మొక్కలు
……………………………………………………………………………………………
అర్బన్ ఫారెస్ట్ పార్కులు- బ్లాకుల అభివృద్ధి
2013-14 : 0
2014-20 : 109 ఎంపిక (36 పార్కులు పూర్తి, ప్రజలకు అందుబాటులోకి)
సర్కిళ్లు
2013-14 : 5
2019-20 : 12
డివిజన్లు
2013-14 : 28
2019-20 : 52
అటవీ రేంజ్ లు
2013- 14 : 108
2019-20 : 185
బీట్ ల సంఖ్య
2013 -14 : 1428
2019- 20 : 3132
బీట్ పరిధి
2013-14 : 19 చదరపు కిలోమీటర్లు (4695 ఎకరాలు)
2019-20 : 8.5 చదరపు కిలోమీటర్లు (2100 ఎకరాలు)
మొత్తం పోస్టులు :
2013- 14 : 5359
2019- 20 : 6859
వాహనాలు
2013 -14 : 431
2019- 20 : 2574
చెక్ పోస్టులు
2013 -14 : 42
2019- 20 : 58
అభివృద్ది చేసిన రహదారి వనాలు (అవెన్యూ ప్లాంటేషన్)
2013 -14 : లేవు 2019- 20 : 7,522 కిలో మీటర్లు
మంకీ ఫుడ్ కోర్టులు
2013 -14 : లేవు
2019- 20 : సుమారు ఐదు వేల ఎకరాల్లో