ఖమ్మం, జూన్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రవ్యాప్తంగా వందలాదిమంది గుత్తేదారులకు వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, దీంతో అనేకమంది గుండెలు ఆగిపోయాయని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్లో స్థానిక కాంట్రాక్టర్లతో కలిసి అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి, రాష్ట్ర చైర్మన్ శ్రీనివాసరావు, కార్యదర్శి పవన్, కోశాధికారి సంతోష్రెడ్డి, కిసాన్ శ్రీనివాసరావు, ఖమ్మం సెంటర్ చైర్మన్ కిశోర్ మీడియా సమావేశం నిర్వహించారు. గుత్తేదారుల్లో భరోసా కల్పించేందుకు 18న చలో హైదరాబాద్కు పిలుపునిస్తూ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వివిధ శాఖలకు సంబంధించిన కాంట్రాక్టర్లు బిల్లులు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదనచెందారు. కొద్దిమందికి మాత్రమే బిల్లులు అందుతున్నాయని, ఆది నుంచి నిర్మాణ పనులు చేసిన వారికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదని విమర్శించారు. ఇప్పటికే చాలామంది గుండెపోటుతో మృతిచెందగా, కొందరు ఆత్మహత్య చేసుకున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం రూ.20 వేల కోట్లు చెల్లించాల్సి ఉన్నదని సూచించారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు బిచ్చగాళ్లలా తిరుగుతున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని మండిపడ్డారు. చలో హైదరాబాద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.