ఢిల్లీ, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ త్వరగా క్లియర్ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. రాజ్యాంగంలోని 200 (1) అధికరణ ప్రకారం ‘సాధ్యమైనంత త్వరగా..’ అనే అంశాన్ని గుర్తించాలని హితవుపలికింది. గవర్నర్లు రాజ్యాంగానికి లోబడే పనిచేయాలని సూచించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తమిళి సై పెండింగ్లో పెట్టడాన్ని తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. గవర్నర్ తరఫున సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
గవర్నర్ వద్ద ఏ బిల్లులు పెండింగ్లో లేవని కోర్టుకు తెలిపారు. కొన్ని బిల్లులను మాత్రం తిప్పి పంపారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. గవర్నర్ కీలక బిల్లులను తిప్పి పంపారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. త్వరితగతిన బిల్లులకు ఆమోదం తెలిపేలా తెలంగాణ రాజ్భవన్కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం చేసిన తీర్మానానికి మోక్షం కల్పించకుండా గవర్నర్ బిల్లులను తన వద్ద పెండింగ్లో పెట్టుకోవడం దారుణమని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200(1) అధికరణం సాధ్యమైనంత త్వరగా బిల్లులను క్లియర్ చేయాలని చాలా స్పష్టంగా పేర్కొంటున్నా.. బిల్లులను పెండింగ్లో పెట్టడం చట్టసభలను అగౌరపర్చడమేనని పేర్కొన్నారు. గవర్నర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు.
గవర్నర్ రాజ్యాంగానికి లోబడి విధులు నిర్వహించాలని, ప్రజా ప్రభుత్వంపై పెత్తనం చేసేందుకు గవర్నర్కు ఎలాంటి అధికారాలు లేవని పేర్కొన్నారు. గవర్నర్ తనవద్దే బిల్లులను పెండింగులో పెట్టుకోవడం సమంజసం కాదని అన్నారు. మధ్యప్రదేశ్లో వారంలోపు, గుజరాత్లో నెలలోగా గవర్నర్లు బిల్లులన్నీ ఆమోదిస్తున్నారని, తెలంగాణలో బీజేపీయేతర పార్టీ అధికారంలో ఉన్నందునే బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ బిల్లులను పెండింగ్లో పెట్టారని తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం ఎప్పటికప్పుడు బిల్లులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని గవర్నర్కు సూచించింది. గవర్నర్ వద్ద ప్రస్తుతం ఎలాంటి బిల్లులు పెండింగ్లో లేనందున ఈ కేసును ముగిస్తున్నామని తెలిపింది.