జూలపల్లి, ఏప్రిల్ 11 : నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం అబ్బాపూర్, జూలపల్లి రైతులు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు దిష్టిబొమ్మను దహనం చేశారు. చెరువులు, కుంటలు ఎస్సారెస్పీ నీటితో నింపాలని రెండు నెలలుగా విజ్ఞప్తి చేసినా ఏ మాత్రం చలనం లేదని ధ్వజమెత్తారు. చేతగాని ఎమ్మెల్యే తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సాగునీరు లేక చేతికి వచ్చే దశలో ఉన్న పంటలు ఎండిపోతున్నామని తాము అల్లాడుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సాగునీరు ఇవ్వకపోతే రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. వెంటనే ఎస్సారెస్పీ డీ-83 ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రైతులను ఆదుకోకపోతే దశల వారీగా ఆందోళనలు చేస్తామని అన్నారు.