Gandhi Hospital | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ కార్లు.. బొమ్మలు.. గోడలపై కార్టూన్ చిత్రాలు.. ఆడుకుంటూ సందడి చేస్తున్న చిన్నారులు.. ఇది ఏ పార్కులో కనిపించిన దృశ్యమో అనుకొంటే మీరు పప్పులో కాలేసినట్టే. చిన్నారులకు ఆహ్లాదకరంగా చికిత్స అందించేందుకు గాంధీ దవాఖానలోని పీడియాట్రిక్స్ వార్డు ఇలా ముస్తాబయ్యింది. ఇక్కడ చిన్నారులు ఆడుతూ పాడుతూ చికిత్స పొందుతున్నారు. సాధారణంగా చిన్నారులు దవాఖాన అంటే భయపడిపోతారు. చికిత్స పొందినన్ని రోజులూ బెడ్ మీద పడుకొని ఉండాల్సిందే.
దీనిని దృష్టిలో పెట్టుకొనే గాంధీ అధికారులు పీడియాట్రిక్ వార్డులో అహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించారు. వార్డులో ప్రత్యేకంగా ఆట స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అడ్మిట్ అయిన చిన్నారులు పొద్దంతా బెడ్పైనే పడుకోకుండా వార్డు ప్రాంగణంలో ఉన్న ఆట స్థలంలో ఉల్లాసంగా గడుపుతున్నారు. సర్జరీలు జరిగిన పిల్లలు నొప్పి కూడా మరిచిపోయి ఆటలాడుకుంటూ సేదతీరుతున్నారు. పిల్లలు త్వరగా కోలుకుంటున్నారు.
అనారోగ్యంతో దవాఖానలో చేరిన పిల్లలకు కొంత అహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తే వారు త్వరగా కోలుకునే అవకాశాలుంటాయి. చిన్నపిల్లలు బెడ్పై ఎక్కువసేపు ఉండడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆట స్థలం కేటాయిస్తే వారికి ఇష్టమున్నప్పుడు వెళ్లి అక్కడ కొంతసేపు సరదాగా గడుపుతారు. మానసికంగా కుదుటపడి అనారోగ్యం నుంచి త్వరగా కోలుకునే అవకాశముంటుంది. వారిలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇలాంటి సౌకర్యం నాకు తెలిసి ఏ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా లేదు.
– డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ దవాఖాన