హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్లో బీజేపీకి భారీషాక్ తగిలింది. మాజీమంత్రి, కీలకనేత ఇనుగాల పెద్దిరెడ్డి.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. ‘మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పార్టీలో కొనసాగడానికి మనసు అంగీకరించడం లేదు’ అని పేర్కొంటూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు సోమవారం రాజీనామా లేఖ పంపించారు. బీజేపీలో ఈటల రాజేందర్ చేరికను అంగీకరించలేకనే ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తున్నది. వాస్తవంగా పెద్దిరెడ్డి హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని భావించారు. కానీ, బీజేపీలో ఈటల రాజేందర్ చేరికతో ఆ అవకాశం లేకుండాపోయింది. గతం నుంచే ఈటల, ఇనుగాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. బీజేపీలోకి ఈటలను ఆహ్వానించడాన్ని ఆయన మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. అయినప్పటికీ అధిష్ఠానం మాత్రం ఈటల వైపే మొగ్గుచూపింది. దీంతో మనస్తాపానికి గురైన పెద్దిరెడ్డి అప్పటినుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన త్వరలోనే టీఆర్ఎస్లో చేరనున్నారని తెలిసింది. రేపోమాపో తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని పెద్దిరెడ్డి అనుచరులు చెప్తున్నారు.