చేవెళ్ల రూరల్, మే 9: బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్కు బీసీ సంఘాల నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లిలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు బీసీ సంఘాల నేతలు మాట్లాడుతూ.. బీసీలమంతా ఏకమై కాసాని జ్ఞానేశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకొంటామని వెల్లడించారు. బీఆర్ఎస్ సర్కార్ కుల వృత్తులకు చేయూత అందించిందని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రోత్సాహం లేక కులవృత్తిదారులు అన్ని విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాసానిని గెలిపిస్తే అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉండి సుపరిపాలన సాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీసీ బిడ్డను పార్లమెంట్కు పంపేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్, గౌడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, మున్నూరు కాపు సంఘం నాయకుడు ఆరె కృష్ణ, రాష్ట్ర ప్రజా చైతన్య సమితి కార్యదర్శి విఠలయ్య, చేవెళ్ల బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి రాంబాబు, కాసాని జ్ఞానేశ్వర్ అల్లుడు వెంకట్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, మాజీ ఎంపీపీ మంగళి బాల్రాజ్, కురుమ సంఘం మండల అధ్యక్షుడు కసిరె వెంకటేశ్, బీఆర్ఎస్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు ఎదిరె రాములు, సర్పంచ్ల సంఘం జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు కేసారం శ్రీనివాస్, కురుమ సంఘం ఆలూర్ గ్రామ అధ్యక్షుడు పరిగి నర్సింహులు, బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.