మేడ్చల్, మే7(నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి లోక్సభ పరిధి స్థానికుడిని.. 25యేండ్లుగా ఏ పదవి లేకున్నా ప్రజలకు సేవ చేస్తున్నానని మల్కాజిగిరి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. మల్కాజిగిరి లోక్సభ పరిధిలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇద్దరూ స్థానికేతరులేనని ఆయన ఆరోపించారు. వారంటీలేని కాంగ్రెస్, హైదరాబాద్ నగర అభివృద్ధికి పైసా కేటాయించని బీజేపీ అభ్యర్థులను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నాని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో గ్రేటర్ హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిని చూసి, మల్కాజిగిరి లోక్సభ పరిధిలో గులాబీ జెండా ఎగుర వేయాలని ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారంటున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ..
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పోటీయే కాదు. అధికార పార్టీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పథకాల అమలులో పూర్తిగా విఫలమైంది. ఐదు నెలల కాలంలోనే విద్యుత్, నీటి సమస్యలను ప్రజలు ఎదుర్కోవాల్సిన దుస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. అందుకే బీఆర్ఎస్కు నామామాత్రంగా బీజేపీ పోటీ ఇస్తుందని భావిస్తున్నాం.
పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధే మా ధీమా. ప్రపంచ దేశాలన్నీ హైదారాబాద్ వైపు చూస్తున్నాయి. ఈ ఘనత కేసీఆర్ నాయకత్వం వల్లే సాధ్యమైంది. మహానగరంలో రోడ్లు, తాగునీటి, విద్యుత్ సమస్యలు లేకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. ఐటీ కంపెనీలు, వేలాది పరిశ్రమలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ నగరం ఉద్యోగాలకు కేంద్రంగా మారింది. ఈ విషయాన్ని హైదరాబాద్ నగరవాసులు గుర్తించారు. అందుకే బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని చూస్తున్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండటం మా విజయానికి కలిసి వస్తున్నది.
బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ప్రచారానికి విశేష స్పందన లభిస్తున్నది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి ఓ మినీ ఇండియా. వివిధ రాష్ర్టాల ప్రజలు ఇక్కడ నివసిస్తారు. బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో కుల, మత పంచాయితీలు లేవు. కేసీఆర్ పాలనను చూసిన ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడే నివాసం ఏర్పరుచుకుని బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతమనే కుట్రలను బీఆర్ఎస్సే బద్ధలుకొడుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకే మమ్మల్ని ఆదరిస్తున్నారు.
మల్కాజిగిరి పార్లమెంట్ రేవంత్రెడ్డికి రాజకీయంగా పునర్జన్మను ఇచ్చింది. కొడంగల్ ప్రజలు ఎమ్మెల్యేగా ఓడిస్తే మల్కాజిగిరి ప్రజలు రాజకీయ భిక్ష ఇచ్చారు. మల్కాజిగిరి ఎంపీగా రేవంత్రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కనీసం ఎంపీ కోటా నిధులను కూడా ఖర్చు చేయలేదు. దీంతో కోటా నిధులన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా రేవంత్రెడ్డి మల్కాజిగిరికి ఏమీ చేయలేదు. పైగా ఇక్కడ కనీసం ఓటు హక్కు కూడా లేని అభ్యర్థిని బరిలో నిలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదవులు అనుభవించిన మహేందర్రెడ్డి కుటుంబానికి ప్రజలే బుద్ధి చెబుతారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో ఒక్కసారైనా పార్లమెంట్లో ఇక్కడి సమస్యలను ప్రస్తావించలేదు. నేను ఎంపీగా గెలిస్తే ప్రజలకు అవసరమైన అన్ని పనులు చేయిస్తాను. ఉప్పల్ కారిడార్తో పాటు ఇటీవలె మంజూరైన సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ కారిడార్ పనులు త్వరగా పూర్తి చేయిస్తా. ఆర్మీ పాంతాలలో అనేక సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. దానిపైనా దృష్టి సారిస్తా. ఎంఎంటీఎస్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ల లింక్ రోడ్ల నిర్మాణాలు చేయిస్తాను.
ప్రజాప్రతినిధిగా లేకున్నా 25 యేండ్లుగా ప్రజలకు అందుబాటులో ఉన్నాను. ఆపదలో తోడైయ్యాను. మధుర ట్రస్టు ద్వారా వేలాది మందికి వైద్య సేవలు అందించాము. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వేలాది మందికి శిక్షణ ఇప్పించాను. కరోనా సమయంలో నేను ఐసీయూలో ఉన్నా.. సేవలు అందించినందున ప్రజలు నన్ను గుర్తుంచుకున్నారు. నేను ప్రజల తరపున ఫైటర్ని. ప్రజల దీవేనతో కేసీఆర్ ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో విజయం సాధిస్తాననే ధీమా ఉంది.