BJP | హైదరాబాద్, మే 9 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల్లో ఓటమి భయంతో అధికార బీజేపీ పెద్దయెత్తున సిట్టింగ్లకు టికెట్లను నిరాకరించింది. ఎన్డీయే కూటమిలో ప్రధాన పక్షమైన బీజేపీ నుంచి దాదాపు 450 నియోజకవర్గాల్లో అభ్యర్థులు బరిలోకి దిగగా.. ఇందులో 130కి పైగా సీట్లలో పార్టీ అధిష్ఠానం కొత్తవారినే ఎంపిక చేసింది. సిట్టింగ్లపై ఉన్న వ్యతిరేకత.. ఫలితాలపై ప్రభావం చూపించవచ్చన్న కారణంతోనే దాదాపు 110 మందిని బీజేపీ తప్పించినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిట్టింగ్ ఎంపీ మరణం, శాసనసభకు ఎన్నికవ్వడం, అనారోగ్యం, పార్టీ ఫిరాయింపు తదితర కారణాలతో మరో 20 స్థానాల్లో బీజేపీ కొత్తవారిని తీసుకొచ్చినట్టు చెప్తున్నారు.
అయితే, ఏడాది కిందట జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 20 శాతం సిట్టింగ్లకు టికెట్లను నిరాకరించినప్పటికీ.. బీజేపీకి విజయం దక్కలేదు. ఇప్పుడు కూడా అదే రిపీట్ కావొచ్చన్న వార్తలు వస్తున్నాయి. మూడు దఫాల్లో జరిగిన పోలింగ్లో ఓట్ల శాతం తగ్గడాన్ని చూస్తే, బీజేపీకి హ్యాట్రిక్ విజయం సాధ్యంకాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో ఎంపీలుగా పనిచేసిన వారికే కాదు కేంద్రమంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన 11 మందిని కూడా బీజేపీ టికెట్లు ఇవ్వకుండా ఈ ఎన్నికల్లో పక్కనబెట్టింది. జాబితాలో అశ్వినీ కుమార్ చౌబే, జనరల్ వీకే సింగ్, మీనాక్షి లేఖీ, దర్శనా విక్రమ్, సోమ్ ప్రకాశ్, రామేశ్వర్ తేలీ, నారాయణ స్వామి, ప్రతిమా భౌమిక్, రాజ్కుమార్ రంజన్సింగ్, బిశ్వేశ్వర్, మంజుపారా ఉన్నారు. పనితీరు సరిగా లేకపోవడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తదితర కారణాలతో వీరిని పక్కకు పెట్టినట్టు తెలుస్తున్నది.