Peddi Sudarshan Reddy | వరంగల్ : వరంగల్ జిల్లాలోనే అతిపెద్ద రాజకీయ కుట్రదారు కడియం శ్రీహరి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధ్వజమెత్తారు. వరంగల్లో ఆయనను ఓడించి రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటామని సుదర్శన్ రెడ్డి తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో సుదర్శన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
అన్ని రకాల పదవులు అనుభవించిన కడియం శ్రీహరి.. ఇవాళ కేసీఆర్ను మోసం చేసి పార్టీని వీడారు. డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా పదవులు అనుభవించి చివరకు వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ నేతలను నట్టేట ముంచారు కడియం శ్రీహరి. ఈ జిల్లాలోనే అతిపెద్ద రాజకీయ కుట్రదారు కడియం శ్రీహరి పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు.
వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కసితో పని చేయాలి. కేసీఆర్ ఆపదలో ఉన్నారు. కవిత జైల్లో ఉన్నారు. కేసీఆర్పై అనేక కుట్రలు జరుగుతున్నాయి. తనకు 32 ఏండ్ల రాజకీయ అనుభవం ఉంది. కడియం లాంటి మోసగాడిని తన జీవితంలో చూడలేదు. తమ కోరిక ఏందంటే.. ఈ పార్లమెంట్ ఎన్నికలతో కడియం శ్రీహరి రాజకీయ సన్యాసం తీసుకునేట్టు చేయడమే అని సుదర్శన్ రెడ్డి తేల్చిచెప్పారు.
గతంలో కడియం శ్రీహరిని ఓడగొట్టిన దాని కంటే ఎక్కువ కసితో బీఆర్ఎస్ కార్యకర్తలు పని చేయాలి. అధికారం శాశ్వతం కాదు. వరంగల్లో జరిగే రాజకీయం వేరు. రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగానే కడియం కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. కడియం శ్రీహరి టీఆర్ఎస్ పార్టీలో అడుగు పెట్టక ముందే ఘనపూర్లో గులాబీ జెండా ఎగిరింది. వరంగల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పి, ఆ టికెట్ తన బిడ్డకు ఇష్టం లేకనే పార్టీ నుంచి తప్పుకున్నట్లు కడియం శ్రీహరి స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకే కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసమే ఆ పార్టీలో చేరానని తెలిపారు. రేపు కాంగ్రెస్ పార్టీలో కూడా అలానే అనిపిస్తే.. చివరకు కేఏ పాల్ పార్టీలోకి అలానే వెళ్తావా..? అని సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు.
నాగుపాముకు, కడియంకు తేడాలేదు. పార్టీలోకి కడియం వచ్చిప్పుడు వ్యతిరేకించిన వారిలో తాను కూడా ఉన్నాను. మేం త్యాగాలు చేస్తే పదవులు అనుభవించారు కడియం. ఆయనకు కేడర్ పది మంది కంటే ఎక్కువ లేరు. 75 ఏండ్ల వయసులో ఉన్న నీవు కొత్త తరానికి ఏం మేసేజ్ ఇస్తున్నావు. ఇదేనా నీ రాజకీయ పరిణితి. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటే ఆ పార్టీలోకి వెళ్లడమేనా నీ రాజకీయ తెలివి అని సుదర్శన్ రెడ్డి నిప్పులు చెరిగారు.