హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు కోసం మార్క్ఫెడ్ సంస్థను కూడా తాకట్టు పెడుతుంది అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పౌర సరఫరాల శాఖకు అప్పు దొరకకపోతే, మార్క్ఫెడ్ సంస్థను అడ్డు పెట్టుకుని 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కోసం రూ.22,700 కోట్ల అప్పు తీసుకొచ్చారన్నారు. మక్కజొన్నలు కొనుగోలు చేసే మార్క్ఫెడ్ సంస్థ ద్వారా ప్యాడీ కొనుగోలుకు అప్పు తెస్తే మరి మక్కజొన్న కొనేందుకు డబ్బులు ఎక్కడినుండి తెస్తారు? అని ప్రశ్నించారు.
రైతుల వద్ద కొనుగోలు చేసిన మూడు నెలల తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పడం మోసం కాదా? అని మండిపడ్డారు. మక్కజొన్న కొనుగోళ్లు మొదలయి 23 రోజులు గడుస్తున్నా ఇంతవరకు జీవో విడుదల చేయకపోవడం వెనుక రహస్యం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.