Koppula Eshwar | కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగు నీళ్లు ఇవ్వడం లేదని.. నీళ్లు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. సాగు నీటి కోసం రైతులు రోడ్డెక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుతో కలిసి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రౌడీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఫ్రెండ్లీ రాజకీయాలు చేశామని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేస్తే మరింత నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆలోచనతో ఓటు వేయాలని.. బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.