Putta Madhu | ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసే విధంగా సాధ్యం కానీ హామీలు ఇస్తూ.. వాటిని నమ్మించేందుకు ఏకంగా దేవుళ్లపైనే ఓట్లు పెడుతూ గిన్నిస్ బుక్ రికార్డు కోసం సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు విమర్శించారు. 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పిన రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మాట మార్చారని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ కుట్రలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని పుట్ట మధు స్పష్టం చేశారు. దేవుళ్లపై ఓట్లు పెట్టి హామీలు అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రులు ఇప్పటివరకు దేశంలో ఎవరూ లేరని పుట్ట మధు విమర్శించారు. ఆ ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఎక్కడైనా సీఎం మాట చెప్పారంటే.. అది ఒక జీవోగా, చట్టంగా, శాసనంగా ఉంటుందని.. కానీ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి మాటకు విలువ లేకుండా పోయిందని తెలిపారు. దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నా అంటూ హామీలు ఇవ్వడం ప్రజాస్వామ్యానికే అవమానమని విమర్శించారు.
రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పుట్ట మధు కొనియాడారు. రైతు బాగుపడితే.. దేశం బాగుపడుతుందని భావించి కరెంట్, నీళ్లు, పెట్టుబడి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. గతంలోని బీఆర్ఎస్ పాలనను, ప్రస్తుత కాంగ్రెస్ పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచేలా, ప్రజలకు సేవ చేసేలా కర్రు కాల్చివాత పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకోసం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాలని అభ్యర్థించారు.