పెద్దపల్లి: గుండెపోటు.. ఇప్పుడు ఈ పదం వినగానే అంతా టెన్షన్ పడిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో (Heart attack) చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారుకూడా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. అప్పటివరకు బాగున్నవారు గుండెపోటుతో చనిపోతున్నారు. ఎప్పుడు, ఎవరికి ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం మేడ్చల్లోని సీఎంఆర్ (CMR) ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి గుండెపోటుతో మృతిచెందాడు. స్నేహితులతో సరదాగా ముచ్చట్లు పెడుతున్న విశాల్ సడన్గా కిందపడిపోయాడు. దీంతో తోటివారు ఆయనను దవాఖానకు తీసుకెళ్లేలోపే మరణించాడు. గతవారం బోయిన్పల్లిలో (Bowenpally) ఓ కానిస్టేబుల్ జిమ్లో వ్యాయామం చేస్తుండగా సడన్గా కూలబడిపోయాడు. తోటివారు వచ్చేలోపు ఆయన గుండె ఆగిపోయింది.
తాజాగా పెద్దపల్లి (Peddapalli) జిల్లా డీసీసీ అధ్యక్షుడు రాజ్ఠాకూర్ తమ్ముడు శైలేందర్ సింగ్ (Shailendra singh) ఉన్నట్టుండి గుండెపోటుతో మృతిచెందారు. గోదావరిఖనికి (Godavarikhani) చెందిన శైలేందర్సింగ్ రోజూలానే శుక్రవారం (మార్చి 3న) తన ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా కార్డిక్ అరెస్టుతో కుప్పకూలిపోయారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న శైలేందర్.. తలుపునకు తాళం వేసి.. నాలుగు అడుగులు వేశారు. ఈ క్రమంలో గుండె నొప్పిరావడంతో పక్కనేఉన్న గోడను పట్టుకుని కిందపడిపోయారు. క్షణాల వ్యవధిలోనే ప్రాణాలు వదిలారు. ఇదంతా శైలేందర్ ఇంటిబయట ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది.