సూర్యాపేట : దేశంలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జాతర జరగనుందని పేర్కొన్నారు. ఆసియాలోనే అతి పెద్ద జాతరగా పేరొందిన దురాజ్పల్లి పెద్ద గట్టు జాతరకు 10 నుండి 15 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగు నీరు, మరుగుదొడ్ల సౌకర్యం వంటి వసతులు కల్పనపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేసారం గ్రామానికి చెందిన మెంతబోయిన యాదవ వంశస్తుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.
పెద్దగట్టు జాతర ఏర్పాట్లను మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలిస్తున్న క్రమంలో యాదవ కుటుంబాలకు చెందిన భక్తులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఏర్పాట్లు ఎలా వున్నాయని మంత్రి వారిని అడుగగా, గతంతో పోలిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక, జగదీష్ రెడ్డి సూర్యాపేటకు వచ్చిన తర్వాత కోట్ల రూపాయల నిధులు ఇచ్చి చేస్తున్న ఏర్పాట్లు చాలా బాగున్నాయని భక్తులు పేర్కొన్నారు. మంత్రి జగదీష్ రెడ్డికి ప్రతీ యాదవ కుటుంబం రుణ పడి ఉంటుందన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డితో పాటు పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, కలెక్టర్ హేమంత్ పాటిల్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ పుట్టా కిషోర్, కౌన్సిలర్లు లక్ష్మీమకత్ లాల్, బాషా మియా, పెన్ పహాడ్ ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీలు సంజీవ నాయక్, జీడి భిక్షం, అంజయ్య, చివ్వెంల వైస్ ఎంపీపీ జీవన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఉప్పల ఆనంద్, కాచం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.