ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై పీడీయాక్ట్ నమోదైంది. రాజాసింగ్పై మంగళ్హాట్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. తరుచూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నందునే రాజాసింగ్పై పీడీ యాక్ట్ నమోదు చేశారని తెలిపారు. మత ఘర్షణలు చోటు చేసుకునేలా రాజాసింగ్ ప్రసంగాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ నెల 22న ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో రాజాసింగ్ ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిందన్నారు. ఈ క్రమంలోనే రాజాసింగ్ను 23వ తేదీన అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మరోసారి వీడియోలు విడుదల చేస్తామని రాజాసింగ్ మీడియాకు ప్రకటించారు. మతవిద్వేషాల ప్రసంగాల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. వీడియో కారణంగానే నిరసనలు, ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. వ్యాపార సముదాయాలు మూతపడ్డాయని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే రాజాసింగ్ను అరెస్ట్ చేసి, చర్లపల్లి జైలుకు తరలించారు.
2004 నుంచి రాజాసింగ్పై 101 కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 మతపరమైనవే కావడం గమనార్హం. పీడీయాక్టు నమోదుతో రాజాసింగ్కు బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఒక ఎమ్మెల్యేపై పీడీయాక్టు నమోదు కావడం ఇదే మొదటిసారి. చాలాసార్లు ఒకమతాన్ని, వర్గాన్ని కించపర్చేలా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని సీపీ వెల్లడించారు. రాజాసింగ్పై దేశవ్యాప్తంగా 42 కేసులు నమోదయ్యాయి.