Mahesh Kumar Goud | హైదరాబాద్, అక్టోబర్ 20(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29తో గ్రూప్-1 అభ్యర్థులకు ఎలాంటి నష్టం లేదని, లాభమే జరుగుతుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. తాను తెలుసుకున్న సమాచారం ప్రకారం జీవో 29 వల్ల 75 నుంచి 80 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులే మెయిన్స్కు ఎంపికవుతారని తెలిపారు. సమాచారంలోపం వల్ల ఈ సమస్య ఏర్పడిందని, దీనిపై చాలా మంది అపోహ పడుతున్నారని పేర్కొన్నారు. గ్రూప్-1 వివాదం, విద్యార్థుల ఆందోళనపై ఆదివారం గాంధీభవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. అర్థం చేసుకొని, ప్రశాంతంగా పరీక్ష రాయాలని అభ్యర్థులకు సూచించారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఒక్కో కేంద్రంలో 20 మందికి పైగా పోలీసులు విధుల్లో ఉంటారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలోనే ఈ పరీక్షలు జరుగుతాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు, జిల్లా అదనపు కలెక్టర్లు సైతం తనిఖీలు నిర్వహిస్తారు. జీవో-29పై సోమవార ఉదయమే సుప్రీంకోర్టులో కేసు విచారణకు రానున్నది. సుప్రీంతీర్పు నేపథ్యంలో అంతటా ఉత్కంఠ నెలకొన్నది. మధ్యాహ్నం నుంచే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తంగా 31,383 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు.