బాన్సువాడ/నస్రుల్లాబాద్, మార్చి 20: పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేపట్టిన ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్ర జనం లేక బోసిపోతున్నది. దీంతో డబ్బులు ఇచ్చి జనాలను తీసుకొచ్చి పాదయాత్రను కొనసాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. సోమవారం ఉదయం 9.30 గంటలకు బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్లో రేవంత్రెడ్డి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. జనం లేకపోవడంతో పార్టీ నేతలు తలలు పట్టుకున్నారు. దాదాపు గంటన్నర పాటు వేచి చూసి, చివరకు ఉన్న కొద్ది మందితోనే పాదయాత్ర ప్రారంభించారు.
రేవంత్తో పాటు ఆయన సెక్యూరిటీ సిబ్బంది, కొందరు నాయకులు తప్ప పెద్దగా క్యాడర్ కానీ, జనం కానీ కనిపించలేదు. దీంతో డబ్బులు ఇచ్చి అప్పటికప్పుడు జుక్కల్, బోధన్, కామారెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గాల నుంచి కొందరిని ఇక్కడికి తరలించారు. రూ.500 ఇస్తామని తీసుకొచ్చి రూ.200 మాత్రమే చేతిలో పెట్టడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి బాన్సువాడలో నిర్వహించిన మీటింగ్కు సైతం డబ్బులు ఇచ్చి వివిధ ప్రాంతాల నుంచి జనాన్ని తరలించారు. కాంగ్రెస్ కార్యకర్తలు బహిరంగంగానే డబ్బులు పంచుతూ మీడియాకు దొరికిపోయారు.