హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఎస్యూపీ) నియంత్రణను సమర్థంగా అమలు చేసి, ఎస్యూపీ రహితంగా తీర్చిదిద్దిన పట్టణాలకు బహుమతులు ఇవ్వనున్నట్టు మున్సిపల్శాఖ, కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించాయి. జనాభా ప్రాతిపదికన పట్టణాలను, నగరాలను విభజించి బహుమతులు అందించనున్నట్టు సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం మాసబ్ ట్యాంక్లోని సీడీఎంఏ కార్యాలయం నుంచి మున్సిపల్ కమిషనర్లతో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి నీతూ కుమారి ప్రసాద్, సీడీఎంఏ సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. 70 మైక్రాన్లలోపు మందమున్న ప్లాస్టిక్ను 2021 సెప్టెంబర్ 30 నుంచి నిషేధించినట్టు తెలిపారు. 120 మైక్రాన్ల ప్లాస్టిక్పై 2022 డిసెంబర్ 31 నుంచి నిషేధం అమలులోకి వస్తుందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం అమలులో మున్సిపల్ సిబ్బంది పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. ప్రజలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ద్వారా జరిగే నష్టాలు, అనర్థాలను వివరించాలని, ప్లాస్టిక్ ప్రతామ్నాయాలను ప్రజల ముందు ఉంచితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. వ్యాపారులు, దుకాణాదారులతో సమావేశాలు నిర్వహించాలన్నారు.
పీసీబీ సభ్య కార్యదర్శి నీతూ కుమారి ప్రసాద్ మాట్లాడుతూ.. నిషేధించిన 19 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు, వాటికి ప్రత్యామ్నాయాలు రియూజబుల్ సాంకేతికతపై పురపాలక సంఘాలకు మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. జిల్లా స్థాయి టాస్ఫోర్స్, పట్టణస్థాయి టాస్ఫోర్స్తోపాటు వార్డుస్థాయి టాస్ఫోర్సులను కూడా ఏర్పాటుచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణను అమలుచేయాలని చెప్పారు.