హైదరాబాద్ : అటవి సంపదపై వచ్చే ఆదాయం ఆ ప్రాంత ప్రజలకే చెందాలనే ఉద్దేశ్యంతో రాయల్టీ డబ్బులను కూలీలకు బోనస్ రూపంలో ప్రభుత్వమే చెల్లిస్తుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అరణ్య భవన్ లో కూలీలకు తునికాకు సేకరణ పెండింగ్ బోనస్ చెల్లింపులు, ఈ సీజన్ లో తునికాకు సేకరణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే ఆలస్యమైన బోనస్ డబ్బులను వీలైనంత త్వరగా కూలీలకు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
వేసవిలో సుమారు 2. 50 లక్షల మంది గిరిజన, గిరిజనేతర కూలీలకు ఆదాయం సమకూర్చిపెట్టే తునికాకు సేకరణకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అడవిపై స్థానిక ప్రజలకే పూర్తి హక్కులు ఉన్నాయని వెల్లడించారు. అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర పునర్విభజన అనంతరం ఇరు రాష్ట్రాల నెట్ రెవెన్యూ షేర్ లను తేల్చడం, కూలీలు వేర్వేరు ప్రాంతాల్లో ఉండటంతో వారి వివరాల సేకరణ వల్ల బోనస్ చెల్లింపుల్లో జాప్యం జరిగిందని అధికారులు మంత్రికి వివరించారు.
తునికాకు సేకరించే కూలీల పేర్లు, బ్యాంక్ ఖాతాల వివరాల సేకరణ పూర్తైందని, దాదాపు రూ. 233 కోట్ల బోనస్ డబ్బులు చెల్లించాల్సి ఉందని చెప్పారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్.ఎం. డొబ్రియల్, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ , ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, అదనపు పీసీసీఎఫ్ వినయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.