Khammam | ‘కబడ్డీ.. కబడ్డీ’ అని కూత పెట్టాల్సినవాడు ‘డబల్ రొట్టె.. డబల్ రొట్టె’ అనేసరికి బడి పిల్లలందరూ ఘొల్లున నవ్వారు! పొద్దున్నే లేచి డబల్ రొట్టెలమ్మి, బడికి వెళ్లే ఆ పేద విద్యార్థికి అలవాటైన పలుకు అది! కానీ, ఏడో తరగతితోనే కరీం చదువు ఆగిపోయింది. అదే ఏడాది తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. దాంతోపాటే..తెలంగాణ వస్తే ‘రియల్ ఎస్టేట్ ఢమాల్’ అనే పుకార్లూ బలంగా వ్యాపించాయి. తెలంగాణ వచ్చింది. దశాబ్దం గడిచింది.ఇప్పుడు మూడు వెంచర్లు, ఆరు రిజిస్ట్రేషన్లుగా సాగిపోతున్న రియల్ ఎస్టేట్ రంగంలో కరీం అడుగుపెట్టాడు. బిల్డర్గా ఎదిగాడు.అలా, డబల్ రొట్టెల కరీం పేదరికాన్ని గెలిచాడు. ఈ వెలుగు కరీంనే కాదుఎంతోమంది నిరుద్యోగులను, చిరుద్యోగులను, ఆటో డ్రైవర్లను, రైతులను, కూలీలను.. పై అంతస్తులకు ఎక్కించిందని ఖమ్మం జిల్లా రియల్టర్లు చెబుతున్నారు. అలనాటి ‘రియల్ ఢామ్’ అబద్ధాన్ని బద్దలు కొట్టి అంతకంతకూ విస్తరిస్తున్న నేటి రియాలిటీ బూమ్పై దశాబ్ది ఉత్సవాల వేళ ఓ ప్రత్యేక కథనం..
తెలంగాణ వచ్చిన కాలానికి ఉద్యమాల ఖమ్మం ఒక పట్టణం. నాలుగు జిల్లాల (ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్) ఉద్యోగులు, వ్యాపారులు సొంత ఇళ్లు కట్టుకోవాలనే ఆశతో ఖమ్మంలో జాగా కొంటున్నారు. దీంతో నగరం నలుదిక్కులా విస్తరిస్తూ పోతున్నది. చుట్టుపక్కల పల్లెలూ నగరంలో కలిసిపోయాయి. అక్కడికే పరిమితం కాకుండా రియల్ ఎస్టేట్ జిల్లాలోని పల్లెలకూ విస్తరించింది. నగరానికి 77 కిలోమీటర్ల దూరంలో.. భౌగోళికంగా ఆంధ్రాలోకి చొచ్చుకు పోయినట్లుగా ఉండే ఎర్రుపాలెంలోనూ రియల్ ఎస్టేట్ జోరు మీదుంది. ఖమ్మంతో పోలిస్తే..విజయవాడ, అమరావతి దగ్గరగా ఉన్నాయి. అయినా ఆ జోలికి వెళ్లకుండా.. ఇక్కడి భూములే పోటీపడి కొంటున్నారు ప్రజలు. విద్యుత్తు, నీళ్లు, ప్రభుత్వ పాలసీలే ఈ బూమ్కు కారణమని చెబుతారు విశ్లేషకులు.
సరిగ్గా తెలంగాణ ఉద్యమం రాజకీయ రూపం తీసుకున్న 2001వ సంవత్సరంలోనే ఎండీ కరీం బడి మానేయాల్సి వచ్చింది. అతని పేదరికానికి ఏడో తరగతే ఎక్కువ! అంతకాలం చదివిన బడిలో ఫీజు కట్టకుండా తరగతి గదులు ఊడ్చి, కుండల్లో మంచినీళ్లు పెట్టేవాడు. అందుకు జీతం.. చదువుకునే అవకాశం. అదే బడిలో వాళ్లమ్మ ఆయమ్మగా పని చేసేది. నాన్న వాచ్మెన్. ఇద్దరూ కష్టపడినా ఇల్లు ఎల్లని దుస్థితి. ఆసరాగా సైకిల్పై పాండురంగాపురం, బల్లేపల్లిలో వీధి వీధి తిరుగుతూ డబల్ రొట్టెలు అమ్మేవాడు కరీం. బడి మానేసిన తర్వాత అదే ఫుల్టైమ్ జాబ్ అయ్యింది. కానీ ఎదుగూ బొదుగూ లేని జీవితం. వయసుతోపాటే ఆదాయం కూడా పెంచుకోవాలనే ఆరాటంలో పెయింటింగ్ పనికి పోయాడు. కొన్నాళ్లకు మేస్త్రీ అయ్యాడు. పెద్ద బిల్డర్లతో పరిచయాలు కరీంనూ ఓ మోస్తరు బిల్డర్గా మార్చాయి. ఇప్పుడు కరీం నీడలో పాతిక కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. కరీం జీవితంలో ప్రసరించిన ఈ వెలుగులు ఎక్కడివి?తెలంగాణ వచ్చినంక తెలంగాణ వస్తే ఆంధ్రోళ్లంతా పోతారని, రియల్ ఎస్టేట్ బూమ్ పూర్తిగా పడిపోతుందని అప్పట్లో రాజకీయ నాయకులే కాదు మీడియా కూడా భయపెట్టింది. పది వసంతాల తెలంగాణ నాటికి ఖమ్మం నగరంగా ఎదిగింది. మహానగరంగా విస్తరిస్తున్నది. ఆనాటి భయానికి, నేటి భరోసాకు కారణాలేమిటో రియల్టర్ పావురాల రామకృష్ణ పూసగుచ్చినట్టు చెబుతున్నారు..
‘ఇక్కడ రియల్ ఎస్టేట్ ఢమాల్ అంటుందనే పుకార్లు నమ్మి తెలంగాణను కాదనుకుని ఆంధ్రప్రదేశ్ పోయాను. కంచికచర్ల (కృష్ణా జిల్లా) దగ్గర వ్యవసాయ భూములు, ప్లాట్లు కొన్నాను. రెండేండ్ల తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు కొన్నయి కొన్నట్టే ఉండిపోయాయి. కొంటామని వచ్చినోడే లేడు. నేనేమీ బాగా డబ్బుండి రియల్ ఎస్టేట్లోకి రాలేదు. మాకు ఊళ్లో అయిదెకరాల భూమి ఉంది. పాతిక ఎకరాలు కౌలు చేసిన. పత్తి, మిర్చి, వరి పండించిన. ఎడమ కాలువ ఎండబెట్టారు. ఏడేండ్లు కరువు. వ్యవసాయం దండగైపోయింది. వ్యవసాయం వదిలిపెట్టి ఫైనాన్స్ కంపెనీలో చేరాను. జీతం సరిపోలేదు. పదో తరగతి చదివిన నాకు మరో జాబ్ రాదు. అక్కడే పనిచేసే ఒక మేడమ్ రియల్ ఎస్టేట్ చేయమని సలహా ఇచ్చింది. బతుకుదెరువు మందం సంపాదించుకుందామని వచ్చిన. మొదట్లో బాగానే ఉంది. తెలంగాణ వస్తే ఇక్కడి భూములు కొనరనే పుకార్లు నమ్మి ఆంధ్రలో కొన్నాను. అక్కడే ఇరుక్కుపోయిన. అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి. అగ్గువకు అమ్ముదామనుకున్నా కొనేటోడే లేడు. అరిగోస పడ్డం. ఆంధ్రాలో కొన్న భూముల్ని సగం ధరకి అమ్ముకొని నష్టపోయిన. ఆ డబ్బులతో తెలంగాణలో మళ్లీ భూములు కొన్న. ధరలు రెండేళ్లలో డబుల్, ట్రిపుల్ అయ్యాయి. లక్షల అప్పు నుంచి విముక్తి కలిగింది. కోట్ల రూపాయల ఆస్తులు ప్రాప్తించాయి. ఆ లాభాలతో మరిన్ని భూములు కొంటూ వచ్చాను. ఆ భూముల ధరలు కూడా పెరుగు తున్నాయి. ఇది నా విజయం కాదు, తెలంగాణ విజయం!’
బట్టలుతికాను.. మేడలు కట్టాను!
చిన్నప్పుడు బడికి పోలేదు. అక్షరాలు నేర్వలేదు. అమ్మానాన్న ఊరి బట్టలు ఉతికేది. వాళ్ల వెంట పోయి చెరువు దగ్గర బట్టలు ఉతికాను. 12 ఏండ్ల వయసులో ఒక రైతు దగ్గర ఏడాదికి ఆరు వేల జీతానికి పాలేరుగా చేరాను. డబ్బు పొదుపుగా వాడుకుంటూ బతికాను. పండుగ నాడు కూడా మాంసం వండుకోని రోజులుఉన్నాయి. ఇరవై ఏండ్ల తర్వాత సిమెంట్ అండ్ ఐరన్ సిండికేట్లో హమాలీగా చేరాను. అయిదేండ్లు చేశాను. పాలేరుగా చేసినప్పుడు జీతం డబ్బుల్లో కొంత రైతు దగ్గరే దాచాను. ఆయన ఒక ఎకరం పొలం కొనిపించాడు. ఆ భూమి అమ్మితే పది లక్షలు వచ్చాయి. చింతపల్లి వెంకన్న అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్తో కలిసి ప్లాట్లు కొన్నాను. లాభాలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరం కలిసి బిల్డింగులు కట్టి అమ్మాం. మళ్లీ లాభాలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు వెంకన్నే చూసుకుంటాడు. నేను ఇప్పుడు బిల్డింగ్లు కట్టే పని మీదే ఉన్నాను. నా దగ్గర ఓ పది
కుటుంబాలు పనిచేస్తున్నాయి.
-రేమల్ల రామారావు, బల్లేపల్లి (ఖమ్మం)
వైకల్యాన్ని గెలిచి
పదో తరగతి ఫెయిల్ అయిన తర్వాత సుతారి పనికి, ఇసుక మోయడానికి, అడ్డాకూలీ పనులకు పోయాను. మూడు నెలల తర్వాత పెయింటింగ్ కూలీల అడ్డా మీదికి పోయాను. నాలుగేళ్లు పని చేశాను. పెయింటింగ్స్ వేస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. ఒకరు అక్కడే చనిపోయారు. నేను కోమాలోకి పోయాను. బతికి బయటపడ్డాను. కొన్నాళ్ల తర్వాత అడ్డాకు పోతే ఎవ్వరూ పనికి పిలువలేదు. కార్పెంటర్గా పనిచేస్తూ బిల్డర్గా ఎదుగుతున్న స్నేహితుడు రామాచారి పిలిచి మేస్త్రీని చేశాడు. చేతినిండా పని ఇచ్చాడు. పదేళ్లపాటు పెయింటింగ్ మేస్త్రీగా పనులు చేయించాను. బిల్డర్లతో కలిసి తిరగుతున్నప్పుడు.. ఇల్లు కొన్నవాళ్లు ‘ఆయన మీ పార్ట్ట్నరా?’ అని బిల్డర్ని అడిగేది. ‘కాదు పెయింటింగ్ మేస్త్రి’ అని ఆయన బిల్డర్లకు సమాధానం చెప్పేది. అందరూ బిల్డర్ అనుకుంటుంటే కొన్నాళ్లకు నాలో కోరిక కలిగింది. బిల్డర్గా చిన్న ఇళ్లు కట్టి అమ్మడం మొదలుపెట్టాను. ఉద్యోగుల జీతాలు పెరగడం, బ్యాంకులు లోన్లు ఇవ్వడంతో ఇళ్లు కొనేవారు పెరిగారు. మేస్త్రీ పనులు చూసుకుంటూనే బిల్డర్గానూ వ్యవహరిస్తున్నాను.
-కొర్లపాటి సైదులు, కోయచలక (రఘునాథపాలెం మండలం), ఖమ్మం జిల్లా
మోసాలకు చెల్లుచీటి
తెలంగాణలో రియల్ ఎస్టేట్ బూమ్ 2016లో మొదలై ఇప్పటికీ అద్భుతంగా కొనసాగుతున్నది! ఈ బూమ్కు స్థానిక వనరులు ఒక కారణమైతే తెలంగాణ ప్రభుత్వ పాలసీలు మరో కారణం. డీటీసీపీ లే అవుట్ల వల్ల కొనేవాళ్లు మోసపోయే ప్రమాదం లేదు. కాబట్టి ఎక్కడెక్కడి వాళ్లో ధైర్యంగా వస్తున్నారు. అమ్మకాలు, కొనుగోళ్లు న్యాయబద్ధంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం పాలసీ చేసింది. ఇదే తెలంగాణ రియల్టీ రంగానికి ప్రాణవాయువులా పని చేస్తున్నది. రెరా, డీటీసీపీ, హెచ్ఎండీఏ అప్రూవల్ వెంచర్స్ వల్ల డబుల్ రిజిస్ట్రేషన్ మోసాలు తగ్గి పోయాయి. ఒకప్పుడు భూమి కొనాలంటే పట్టా కాగితాలు చదవాలి. నక్షాలు తనిఖీ చేసుకోవాలి. దీని కోసం ఆఫీసుల చుట్టూ తిరగాలి. చాలాసార్లు తిరిగినా ఉపయోగం ఉండేది కాదు. పైరవీ కారులకే పనులయ్యే రోజులవి. కాబట్టే ఒకప్పుడు తెల్ల చొక్కాలు వేసుకున్న వాళ్లే రియల్ ఎస్టేట్ చేసేది.డాక్యుమెంట్ల పరిశీలన, కొనుగోలుదారుకు భద్రత కల్పించడం.. ప్రభుత్వమే బాధ్యతగా తీసుకున్నది. కాబట్టి పని సులభం అయ్యింది. లాభం రెండింతలు పెరిగింది. అమ్మేవాళ్లు సంతోషంగా అమ్మొచ్చు. కొనేవాళ్లు ధైర్యంగా కొనొచ్చు.
– జె. భరత్, బల్లేపల్లి (ఖమ్మం)
రైతు నేనే.. రియల్ రాజు నేనే
చాలాకాలం వ్యవసాయం చేశాను. వర్షాధార నేలలు. వర్షాభావ పరిస్థితులు.. బోర్లు పడవు. సాగునీళ్లు రావు. చేసేది లేక వ్యవసాయం వదిలిపెట్టాను. మా బావగారి సహకారంతో 1999లో ఫైనాన్స్ వ్యాపారంలోకి వచ్చాను. అది కూడా వదిలిపెట్టి రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చాను. బిల్డర్గా స్థిరపడ్డాను. లాభమే కాదు ఇక్కడ సంతోషమూ ఉంది. ఖమ్మం నగరంలో 400 మంది చిన్నచిన్న బిల్డర్లు జాబ్లాగా చేసుకుని బతుకుతున్నారు. ప్లాట్లు అమ్ముతూ కొంటూ మరో 1500 మంది జీవనం సాగిస్తున్నారు. ఉద్యోగాలు చేసుకుంటూనే రియల్ ఎస్టేట్ చేసేవాళ్లు 1000 మంది వరకూ ఉన్నారు. ఫ్రీ కరెంట్, నీళ్లు, వనరులు, ఉపాధి అవకాశాల వల్లే తెలంగాణలోరియల్ ఎస్టేట్ జోరుగా సాగుతున్నది.
-ఆలస్యం శ్రీనివాసరావు, చింతగుర్తి (ఖమ్మం అర్బన్ మండలం), ఖమ్మం జిల్లా
గవర్నమెంట్ కొలువు కన్నా మిన్న
డిగ్రీ తర్వాత పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేశాను. ఫిజికల్ టెస్టుల్లో పాస్ అయ్యాను. కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకున్నాను. అయినా రాత పరీక్షలో పోయింది. కొద్ది రోజులకే మా నాన్న చనిపోయారు. ఉద్యోగ ప్రయత్నాలు ఆపేసి రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చాను. మొదట అయిదు ఎకరాల పొలం అమ్మాను. ఆ డబ్బుతో ప్లాట్లు కొని అమ్మాను. అలా మొదలైన ప్రయాణం ఇప్పటికీ లాభసాటిగా సాగిపోతున్నది. మధ్యలో తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కొన్ని భయాలున్నా, అవన్నీ తాత్కాలికమే. భూముల అమ్మకాలు వెనక్కి పోలేదు. ఇక్కడ మంచి లాభాలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాలనే ఆలోచన రాలేదు. వేరే వ్యాపారం చేయాల్సిన అవసరమూ రాలేదు.
-తోకచిచ్చు సైదర్ రాజు, పినపాక (తల్లాడ మండలం), ఖమ్మం జిల్లా
అమ్మేవారికి, కొనేవారికి వారధిని
కూలి కంటే ఆటో నడుపుడే మంచిది అనుకున్నా. వెహికిల్ లోన్ తీసుకోవాలన్నా కొంత డబ్బు కట్టాలి. ఆ కొంత కూడా లేకపోతే బంధువు దగ్గర 30 వేలు అప్పు చేసి కొన్నాను. 2004 నుంచి ఎర్రుపాలం నుంచి జి. కొండూరు (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామం)కు ఆటో నడిపి బతుకుతున్నాను. ఆటో మీదనే ఇల్లు నడవాలి. అప్పు తీరాలి. 20 నెలల్లో తీర్చాల్సిన అప్పు మూడు సంవత్సరాలకు తీరింది. ఇక్కడ భూములు కొనడానికి విజయవాడ, గుంటూరు నుంచి ఖమ్మం వస్తున్నారు. ఆటో ఎక్కుతున్నారు. ఒకరోజు ఇద్దరికి దారి చూపిస్తే.. చెరో అయిదువేలు ఇచ్చారు. ఒకే రోజు పది వేలు చేతికొచ్చేసరికి ఆశ్చర్యపోయాను. అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ పని పెట్టుకున్నాను. రోజూ నలుగురు, అయిదుగురు వస్తామని ఫోన్ చేస్తారు. ఒకరో ఇద్దరో తప్పక వస్తారు. నెలకు ఒక సెటిల్మెంట్ అయినా అవుతుంది. అటోళ్లను ఇటోళ్లకు కలపడం, భూమి చూపించడం, బేరం కుదిరితే అగ్రిమెంట్ రాయించడం, రిజిస్ట్రేషన్ చేయించడం. నెలకు సరిపోయే డబ్బులు వస్తున్నయ్. నెల రోజులు ఇల్లెల్లుతుంది! ముప్పై రోజులు ఆటో తోలినా రాని పైసలు ఒక్క సెటిల్మెంట్తో వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ నా జీవితాన్నే కాదు, చుట్టుపక్కల ఉన్న ఎన్నో ఊళ్లను మార్చేసింది. మా ఊరు రేమిడిచర్లలో ఎనిమిది మంది పూర్తిగా ఇదే పని చేస్తూ బతుకుతున్నారు. ఎర్రుపాలెం, జమలాపురం, వెంకటాపురం, బనిగండ్లపాడు, పెద్దగోపవరం, మీనవోలు, ఇట్లా ఏ ఊరిలో చూసినా రియల్ ఎస్టేట్ చేసేవాళ్లు ఉన్నారు. రియల్ ఏజెంట్లు లేని ఊరిని చూపించడం కష్టమే!
– పుచ్చకాయల విజయ్, రేమిడిచర్ల(ఎర్రుపాలెం మండలం), ఖమ్మం జిల్లా
…? నాగవర్ధన్ రాయల
గడసంతల శ్రీనివాస్