ఆదిలాబాద్, జూన్ 7(నమస్తే తెలంగాణ) ః ధరల భారం పేద, మధ్య తరగతి ప్రజల పాలిట శాపంగా మారుతున్నది. రోజు, రోజుకు భారీగా పెరుగుతున్న నిత్యావసర, ఇతర సరుకులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు గృహావసరాల సిలిండర్ ధర మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా రూ.100 పెరగడంతో ప్రజలు ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు పది రోజుల్లో నాలుగుసార్లు పెరగగా.. వీటి పెరుగుదల ప్రజలు, చిరు వ్యాపారులు, రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ఎండకాలం కావడంతో కూరగాయల ధరలు కూడా ఆకాశనంటాయి. కూలీ పనులు, ప్రైవేటు ఉద్యోగాలు, దుకాణాల్లో పనులు చేసుకునేవారు, ఏ రోజుకు ఆ రోజు పనిచేసుకొని కుటుంబాలను పోషించుకునే వారు పెరిగిన ధరలతో పస్తులు ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
రెండు నెలల్లో రూ.100 పెరుగుదల
ఆదిలాబాద్ జిల్లాలో 2,88,346 వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో జనరల్ కనెక్షన్లు 2,05, 250.. దీపం కనెక్షన్లు 46,136.. ఉజ్వల పథకం కింద 36,960 కనెక్షన్లు ఉన్నాయి. గృహావసరాలకు వియోగదారులు 14.2 కిలోల సిలిండర్లను వినియోగిస్తున్నారు. మార్చి మొదటి వారంలో సిలిండర్ ధర రూ.60 పెరగడంతో ప్రస్తుతం రూ.992కు చేరుకున్నది. బిల్లులో వస్తున్న దానికంటే ఆటోచార్జీల పేరిట రూ.38 ఎక్కువ తీసుకుంటూ సిలిండర్కు రూ.1030 వసూలు చేస్తున్నారు. ఆదివారం నుంచి రూ. 29 సిలిండర్ పెంచగా ప్రస్తు తం జిల్లాలో గృహావసరాల సిలిండర్ ధర జీఏస్టీతో కలిసి రూ.1021కు చేరనుండగా.. ఆటో చార్జీలతో కలిపి రూ. 1060 వసూలు చేస్తారు. అధికారుల పర్యవేక్షణ లోపం ఫలితంగా ఒక్కో సిలిండర్కు రవా ణా చార్జీల పేరిట వినియోగదారులు రూ.40 ఎక్కువ చెల్లించాల్సి వస్తున్నది. పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆటో చార్జీలతో నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.
రూ.75 లక్షలకు పైగా భారం
ప్రతి నెల వంట గ్యాస్ వినియోగదారులు వారి అవసరాల మేరకు ఒకటి నుంచి రెండు సిలిండర్లను వాడుతారు. పెరిగిన ధరల ఫలితంగా ఆదిలాబాద్ జిల్లాలోని పేద లు, మధ్య తరగతి ప్రజలకు ప్రతి నెల రూ.75 లక్షల పైగా భారం పడనుంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500 సిలిండర్ అందిస్తామని ప్రకటించినా.. అమలులో మాత్రం అర్హులకు సర్కారు సబ్సిడీ అందడం లేదు. మహాలక్ష్మి పథకంలో భాగంగా 1.02 లక్షల మందికి రూ.500 సిలిండర్ అందిస్తున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించినా చాలా మంది లబ్ధిదారులకు నెలల తరబడి ఈ పథకం డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదు.
ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలం
గృహావసరాలకు వినియోగించే సిలిండర్తోపాటు నిత్యావసరాల ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. యుద్ధం పేరిట ధరలు పెరిగాయని ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నాయి. సిలిండర్ ధర మూడు నెలల్లో రూ.100 పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తున్నది. నెలకు కనీసం రెండు సిలిండర్లను వినియోగమవుతుండగా.. రూ.100 అదనంగా భారం పడుతున్నది. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగు సార్లు పెరగడంతో పేదలు, రోజు వారి కూలీ పనులు చేసుకునే వారు, చిరు వ్యాపారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలి.
– కుర్మే స్వరూపరాణి, బీఆర్ఎస్ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు, ఆదిలాబాద్.
రూ. 500 సిలిండర్ డబ్బులు రావడం లేదు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500 సిలిండర్ పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లాలో 1.02 లక్షల మందికి రూ.500 సిలిండర్ అందిస్తున్నట్లు అధికారుల నివేదికలు తెలియజేస్తున్నా ఆచరణలో మాత్రం పథకం అమలు కావడం లేదు. తమకు రూ.500 సిలిండర్ వచ్చేలా చూడాలని అర్హులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండడం లేదు. ఈ పథకం వర్తించకపోవడంతోపాటు భారీగా పెరిగిన సిలిండర్ ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తున్నది. పేదలపై భారం పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
– విజ్జిగిరి నారాయణ, బీఆర్ఎస్ నాయకుడు