నకిరేకల్, సెప్టెంబర్ 11 : ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా పొగలు అలుముకోగా.. ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. ఓ మహిళ భయంతో కిందికి దూకగా.. తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో సోమవారం జరిగింది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం తెల్లవారుజామున 4గంటలకు 45 మంది ప్రయాణికులతో హైదరాబాద్ బయల్దేరింది. ఉదయం 4:30 ప్రాంతంలో నకిరేకల్ బైపాస్ మూలమలుపు వద్ద అకస్మాత్తుగా బస్సులో నుంచి పొగలు వచ్చాయి.
దీంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు ఒక్కసారిగా కిందికి దిగే ప్రయత్నం చేశారు. బస్సు దిగే మార్గం నుంచి మొదటగా ఇద్దరు దూకారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి. కండక్టర్ సీటు పక్కనే కూర్చున్న నకిరేకల్ పట్టణానికి చెందిన గండమళ్ల మమత (45) డ్రైవర్ బస్సు ఆపే సమయంలో ఒక్కసారిగా దూకింది. రోడ్డు మీద పడడంతో ఆమెకు తల వెనుక భాగంలో తీవ్రగాయమైంది.
గమనించిన స్థానికులు, ప్రయాణికులు వెంటనే 108 అంబులెన్స్ ఫోన్ చేశారు. హుటాహుటిన మమతను, స్వల్ప గాయాలైన వారిని నకిరేకల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మహిళను నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. మిగిలిన 42 మంది ప్రయాణికులు వేర్వేరు బస్సుల్లో హైదరాబాద్ వెళ్లిపోయారు. చిన్న టెక్నికల్ సమస్య ఉన్నదని, బైపాస్ మూలమలుపు వద్ద ఎక్సలేటర్ పట్టుకొని పొగలు వచ్చాయని బస్సు డ్రైవర్ తెలిపారు.