హైదరాబాద్ : సామాన్యుల జేబులను ఖాళీ చేసేలా.. టీజీఎస్ ఆర్టీసీ(TGSRTC) టికెట్ ధరలను(Ticket prices) పెంచింది. పెంచిన బస్సు ఛార్జీలు సామాన్యుడికి తలకు మించిన భారవమతున్నది. దీంతో అధిక బస్సు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ధర్నా(Passengers dharna) చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..మెదక్ జిల్లాల నర్సాపూర్(Narsapur) మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ముందు ప్రయాణికులు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ అధికారులు పల్లె వెలుగు బస్సులు ఏర్పాటు చేసి దాంట్లో స్పెషల్ బస్సుల పేరుతో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగ వేల ప్రయాణికులను దోచుకుంటున్నారంటు వారు ధర్నా చేపట్టారు. ప్రయాణికుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
కాగా, టికెట్ ధరల పెంపుపై రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్టీసి టికెట్ ధరలు విపరీతంగా పెంచి బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికుల నుంచి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గం అని ధ్వజమెత్తారు. టికెట్ ధర రూ. 140తో జేబీఎస్ నుంచి సిద్దిపేటకు వెళ్లిన ప్రయాణికుడు తిరుగు ప్రయాణంలో టికెట్ ధర రూ. 200 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని హరీశ్రావు పేర్కొన్నారు.
హనుమకొండ నుంచి హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సు ప్రయాణం సాధారణ రోజుల్లో రూ. 300 ఉంటే, పండుగ వేళ రూ.420కి ఛార్జీలు పెంచిందని తెలిపారు. బస్సుల సంఖ్య పెంచకుండా, టికెట్ ఛార్జీలు పెంచి తెలంగాణ ప్రజలకు పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమే ప్రజా పాలనన ముఖ్యమంత్రి గారు..? అని హరీశ్ రావు ప్రశ్నించారు.