TSRTC | హైదరాబాద్, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ) : టీఎస్ఆర్టీసీ నిర్ణయాలతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. సెలవు రోజుల్లో జనాలు తక్కువగా ఉంటారనే ఉద్దేశంతో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బస్సులను ఆర్ధాంతరంగా రద్దు చేస్తుండడంతో గంటల తరబడి రోడ్లపై నిలబడాల్సిన పరిస్థితి వస్తున్నది. ఆన్లైన్ టికెటింగ్, ట్రావెలింగ్ యాప్లు అందుబాటులోకి తెస్తున్నామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న యాజమాన్యం బస్సుల రద్దు సమాచారాన్ని మాత్రం కేవలం డ్రైవర్లు, కండక్టర్లు, అధికారులకు వాట్సాప్ గూపుల్లో మెసేజ్లు పెట్టి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
తాజాగా మంగళవారం ఉగాది పండుగ నాడు బస్సులు తక్కువగా నడపడంతో సాయంత్రం 6.30గంటలకు ఇండ్లకు చేరాల్సిన ప్రయాణికులు రాత్రి 11గంటలకు చేరుకున్నారు. బస్సులు రద్దు కావడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తున్నదని, ఇదే అదనుగా సాధారణ సమయాల్లో కంటే మూడింతలు రేట్లు పెంచుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వారు బస్పాస్లు ఉన్నప్పటికీ పండుగ వేళ ఎలాగైనా ఇంటికి చేరాలనే ఉద్దేశంతో తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చిందని వాపోయారు. ఈ విషయమై స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్లను సంప్రదిస్తే.. తమదేమీ లేదని.. రీజియన్ మేనేజర్లు చెప్పినట్లే నడుచుకుంటున్నామంటూ సమాధానం దాటవేస్తున్నారు.
ప్రస్తుతం ఎండలు మండుతున్నా గ్రేటర్ పరిధిలో ఏసీ బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఏసీ బస్సులకు ఆదరణ ఉంటుందని అధికారులు భావించినప్పటికీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మరోవైపు డిమాండ్ ఉన్న రూట్లలో ఆర్టీసీ ఏసీ బస్సులను నడపట్లేదనే విమర్శలు వస్తున్నాయి. మెజారిటీ బస్సులను ఐటీ కారిడార్ పరిధిలోనే నడుపుతున్నారని జనం మండిపడుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే మెహిదీపట్నం-సికింద్రాబాద్, ఎల్బీనగర్-సికింద్రాబాద్, మియాపూర్-కోఠి, మెహిదీపట్నం-కోఠి, ఉప్పల్ -కూకట్పల్లి రూట్లలో ఏసీ బస్సులు నడపాలని డిమాండ్ ఉన్నా ఆర్టీసీ పట్టించుకోవడం లేదు. ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతునప్పటికీ ఆశించిన స్పందన రావడం లేదు.