హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): పండుగల సీజన్ సమీపిస్తున్నా.. ప్రత్యేక రైళ్ల ఊసెత్తని రైల్వే శాఖ.. రెగ్యులర్ రైళ్లలోనే బోగీల సంఖ్యను కుదించి, 30 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తున్నదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. బతుకమ్మ, దసరా పండుగలు సమీపిస్తుండటంతో సొంత ఊళ్లకు వెళ్లేవారు ప్రయా ణ టికెట్లు రిజర్వ్ చేసుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు ప్రత్యేక రైళ్ల ఊసు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, వరంగల్, కరీంనగర్ తదితర నగరాల నుంచి బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా చాలామంది తమ స్వస్థలాలకు వెళ్తుంటారు. వారి కోసం ప్రత్యేక రైళ్ల సంగతేమిటో గానీ, రెగ్యులర్ రైళ్లలోనే బోగీల సంఖ్యను తగ్గించారు. రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. అదనపు ప్రయాణికుల పేరుతో సాధారణ చార్జీల కంటే అదనంగా 30 శాతం చార్జీలు వడ్డిస్తున్నది రైల్వే శాఖ. ప్రయాణికుల సౌకర్యాల గురించి పట్టించుకోకుండా, లాభాలే ధ్యేయంగా రైల్వేశాఖ వ్యవహరిస్తున్నదని, ప్రయాణికులపై అదనపు భారం పడుతున్నదని రైల్వే ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు.
ట్రాకుల మరమ్మతులు, విద్యుద్ధీకరణ పనులు, డబుల్లైన్ నిర్మాణాల పేరుతో పలు ప్రాంతాల్లో రైళ్లను ఆకస్మికంగా రద్దు చేస్తుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పైకి ఏ కారణాలు చెప్పినా.. నష్టాలు వచ్చే మార్గాల్లోనే రైళ్లను ఎక్కువగా రద్దు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు ఎలాంటి ప్రత్యేక రైళ్లు నడపడం లేదని, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్టణం, కర్నూలుసిటీ, తిరుపతి తదితర స్టేషన్లకు వెళ్తున్న రైళ్లకు మాత్రమే తెలంగాణ రైల్వేస్టేషన్లలో అదనపు స్టాపులు ఇస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అయితే, దసరా పండుగతోపాటు ఇతర రద్దీ రోజులను దృష్టిలో పెట్టుకొని గత నెల రోజుల నుంచే అవసరం మేరకు ప్రత్యేక రైళ్లను నిరంతరం నడుపుతున్నట్టు రైల్వే అధికారులు చెప్తున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు రెగ్యులర్ రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతామని రైల్వే అధికారులు అంటున్నారు.