ఉద్యోగ విరమణ అయినా చేతికందని బెనిఫిట్స్.. ఎప్పుడు చెల్లిస్తుందో చెప్పలేని ప్రభుత్వం.. నెలల తరబడి ఎదురుచూపులోనే ప్రాణాలు పోతున్నాయి. బకాయిలను చెల్లించని సర్కారు కారణంగా మరో రిటైర్డ్ ఉద్యోగి కన్నుమూశారు. అనారోగ్యం కబళిస్తున్నా.. ప్రభుత్వం నుంచి కదలిక లేకపోవడంతో ఖమ్మం జిల్లాకు చెందిన రిటైర్డ్ జూనియర్ లెక్చరర్ శ్రీధర్ మృతిచెందారు.
ఖమ్మం అర్బన్, మార్చి 15 : మరో రిటైర్డ్ ఉద్యోగి మరణించారు. అనారోగ్యానికి తోడు ఆర్థిక స మస్యల కారణంగా ఒత్తిడికి గురై ప్రాణాలు వదిలారు. బాధిత కు టుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలో నివాసం ఉంటున్న శ్రీధర్.. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంగ్లిష్ లెక్చరర్గా పనిచేసి 2024 నవంబర్ 30న రిటైర్ అయ్యారు. ఈయన గతంలో అన్నపురెడ్డిపల్లి, దమ్మపేటలో జూనియర్ లెక్చరర్గా పనిచేశారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య వట్టికొండ వీరకుమారి టీచర్గానే పనిచేస్తున్నారు. ఓ కూతురి వివాహం కాగా మరో కుమార్తె బీటెక్ చదువుతున్నది. శ్రీధర్కు ఇప్పటివరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు వైద్యశాలలో దాదాపు రూ.1.2 కోట్లు వెచ్చించి లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. కుటుంబ సభ్యులు అప్పులు చేసి చికిత్స చేయించారు. రెండు నెలల నుంచి హైదరాబాద్లో ఉండి చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం మరణించారు. బెనిఫిట్స్ రాలేదన్న ఒత్తిడి మరింతగా పెరగడంతో ఆరోగ్యం క్షీణించి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
అనారోగ్యంతోపాటు అప్పుల బాధతో మానసిక వేదనకు గురికావడం వల్లనే రిటైర్డ్ జేఎల్ శ్రీధర్ మరణించారని యూటీఎఫ్ ఖమ్మం జిల్లా నేతలు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు ఆరోపించారు. ఈయన మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల కోసం గత డిసెంబర్ నుంచి పలుమార్లు ప్రభుత్వాన్ని సంప్రదించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున కూడా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి విన్నవించినా బెనిఫిట్స్ విడుదల చేయలేదని వారు పేర్కొన్నారు.