కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ కష్టాలు కొని తెచ్చుకున్నట్టేనని పరకాల నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని చంద్రయ్యపల్లె గ్రామంలో ఆయన ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన చల్లాకు ప్రజలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో కొత్తగా పింఛన్ రావాలంటే.. అప్పటికే పింఛన్ వస్తున్న వారు చనిపోతేనే వచ్చేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు ఉంటే వార్త.. నేడు బీఆర్ఎస్ పాలనలో కరెంటు పోతే వార్త, నాడు రైతు ఆత్మహత్యలు.. నేడు రైతుబంధులు.. ఇవన్నీ ప్రజలు గమనించాలని కోరారు. అధికార దాహంతో ప్రజలను మోసం చేయాలని బీజేపీ పార్టీలు చూస్తున్నాయని.. ప్రలోభాలకు గురి చేయాలని చూస్తున్నాయని అన్నారు. తమను మళ్లీ ఆశీర్వదించాలని.. మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి, యువత భవిష్యత్తుకు బాటలు వేస్తానని హామీ ఇచ్చాడు. పరకాల బరిలో నిలిచిన ప్రతిపక్ష నాయకులకు ప్రజల కష్టనష్టాలు తెలియవని ఆయన విమర్శించారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వారు అడ్రస్ లేకుండా పోతారని చెప్పారు. పక్క నియోజకవర్గ ప్రజలు తరిమితేనే ఇక్కడకు వచ్చారని.. అలాంటి వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. కాంగ్రెస్కు ఓటేస్తే కన్నీళ్లే మిగులుతాయని అన్నారు.