హైదరాబాద్ : వెనుకబడిన వర్గాలను ఏకం చేసి, రాజ్యాలను పాలించిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రవీంద్ర భారతిలో పాపన్న జయంతి వేడుకలు నిర్వహించగా.. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పాపన్నను చరిత్రలో లేకుండా చేశాయని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వం పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. లండన్లోని కేంబిడ్రి విశ్వవిద్యాలయంలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు చరిత్రను పొందుపరిచారన్నారు. కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
చరిత్రలో నిలిచిన అనేక మంది మహనీయులను తెలంగాణ ప్రభుత్వం తగు రీతిలో గౌరవించేలా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, మాజీ ఎమ్మెల్సీ రాజలింగం, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం, ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్, ఉపేంద్ర, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.