కమిటీలో వీరే
మంత్రులు కే తారకరామారావు, వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, సీఎస్ సోమేశ్కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా ప్రయాణాలు తగ్గి ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో మెట్రోను ఆదుకొనేందుకు ఉన్న అవకాశాలను అన్వేషిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ఆర్థికంగా నష్టపోతున్న తమను ఆదుకోవాలని కోరుతూ ఎల్అండ్టీ ఉన్నతాధికారులు మంగళవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. కరోనా కాలంలో మెట్రో ఎదురొంటున్న ఆర్థిక నష్టాలు, బ్యాంకు అప్పులు, రోజురోజుకు పేరుకుపోతున్న వడ్డీల వివరాలను సమావేశంలో చర్చించి తక్షణమే ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు. కరోనా కష్టాలను అధిగమించి మెట్రో తిరిగి గాడిలో పడేలా ప్రభుత్వం సహకరిస్తుందని ఎల్అండ్టీ ఉన్నతాధికారులకు సీఎం హామీ ఇచ్చారు.
అనతికాలంలోనే సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో సేవలందిస్తూ ఆదరణ పొందిందని సీఎం కేసీఆర్ చెప్పారు. అన్ని రంగాలను ప్రభావితం చేసినట్లే మెట్రో ను కూడా కరోనా ఇబ్బందుల్లోకి నెట్టిందని తెలిపారు. దినాదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి మెట్రో సేవలు ఎంతో అవసరమని, భవిష్యత్తులో మెట్రో మరింతగా విస్తరించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. కరోనా దెబ్బతో మెట్రో అప్పుల్లో కూరుకుపోవడం, వడ్డీలకు వడ్డీలు కట్టాల్సి రావడం శోచనీయమన్నారు. అన్ని రంగాలను ఆదుకొన్నట్లే మెట్రో ను కూడా గాడిలో పెట్టడానికి తమవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మెట్రోకు మేలుచేయడానికి ఎటువంటి విధానాలు అవలంబించాలో విశ్లేషిస్తామని చెప్పారు. కరోనా వంటి క్లిష్ట సందర్భాల్లో ప్రజావసరాల దృష్ట్యా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుందని వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో ను ఆదుకోవడం ద్వారా తిరిగి పుంజుకొని మరింతగా విస్తరించే దిశగా చర్యలు చేపడతామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందుకుగాను విస్తృతంగా చర్చించి మెట్రోకు పూర్వవైభవాన్ని తీసుకురాగలగడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు.
సీఎం ఏర్పాటుచేసిన కమిటీలో మంత్రులు కే తారకరామారావు, వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ ఉంటారు. మెట్రోను నష్టాలనుంచి ఆదుకొనే అంశంపై అన్ని రకాలుగా పరిశీలించి త్వరలో నివేదిక అందించాలని సీఎం కేసీఆర్ వారిని ఆదేశించారు. సమావేశంలో మంత్రులు మహమూద్అలీ, ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, సురేందర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, సీఎస్ సోమేశ్కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, మున్సిపల్శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, మెట్రో అధికారులు ఎల్అండ్టీ సీఈవో అండ్ ఎండీ సుబ్రహ్మణ్యం, ఎన్వీఎస్ రెడ్డి, సంస్థ డైరెక్టర్ డీకే సెన్, ప్రాజెక్టుల సీఈవో అజిత్, హైదరాబాద్ మెట్రో సీఈవో కేవీబీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.