మంచిర్యాల(నమస్తే తెలంగాణ)/రాయపర్తి/నిజామాబాద్ రూరల్/టేకులపల్లి, మే24 : సమగ్రాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్గా నిలిచిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ ముందు వరుసలో ఉందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లుగా చేపట్టిన ప్రజా సంక్షేమం, సమగ్రాభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ గౌడ కులస్థుల ఆత్మగౌరవ బావుటాను ఎగరేశారని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
బుధవారం మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో నిర్వహించిన మంచిర్యాల- ఆసిఫాబాద్ జిల్లాల గౌడ బాంధవ్య ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాకముందు గౌడ్లు బలపడితే ప్రమాదమని, వీరిని ఎలాగైనా దెబ్బతీయాలనే దురుద్దేశంతో కల్లు కలుషితమనే పేరు చెప్పి దుకాణాలను మూసి వేయించారని తెలిపారు. సీఎం కేసీఆర్ 2014లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 151 కల్లు దుకాణాలను తెరిచి మాట నిలబెట్టుకున్నారని కొనియాడారు.
వైన్స్ షాపుల్లో రిజర్వేషన్, రూ.5 లక్షల ప్రమాద బీమా, చెట్టు పన్ను రద్దు చేసి గౌడ కులస్థులు గౌరవంతో బతికే పరిస్థితి కల్పించారని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేశ్నేత, ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, శాట్స్ చైర్మన్ అంజనేయులు గౌడ్, కల్లుగీత కార్మిక కార్పొరేషన్ చైర్మన్ పల్లెరవి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్గౌడ్ పాల్గొన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీని భూస్థాపితం చేయాలని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు.
నిజామాబాద్ రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాన్ని నగర శివారులోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. మతం పేరిట రాజకీయాలు చేయాలని చూస్తే ప్రస్తుతం ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. సబ్బండ వర్ణాల ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని సాధించి పెడతాయని ధీమా వ్యక్తం చేశారు. సమ్మేళనంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్కు 100కుపైగా సీట్లు రావడం ఖాయమని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ ధీమా వ్యక్తం చేశారు. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం బోడు గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమంలో ఇల్లెందు నియోజకవర్గం అగ్రగామిగా ఉందని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు కోసం రూ.3,320 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.