Congress | హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయితీ ఇప్పుడప్పుడే తేలేలా లేదు. తుది జాబితాలో అడ్డగోలు మార్పులు జరుగుతున్నాయని, పారాచ్యూట్ నేతలకే పెద్దపీట వేస్తున్నారని, కొన్నిచోట్ల సర్వేలను మేనేజ్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న టికెట్ల కేటాయింపులో పీసీసీలోని కీలక నేత ఒకరు తన వారికి టికెట్లు ఇప్పించుకునే క్రమంలో పార్టీ కోసం కష్టపడ్డవారిని అణచివేస్తున్నారనే ఆవేదన వ్యక్తమవుతున్నది. ప్రతి నియోజకవర్గంలో పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్గా పార్టీ నేతలు విడిపోయారు. అంతేకాకుండా టికెట్లు ఇప్పిస్తామంటూ భూదందాలకు పాల్పడుతున్నారని, భూములు రాయించుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్కు టికెట్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అక్కడి నుంచి 2014లో పోటీచేసిన భార్గవ్ దేశ్పాండే, 2018లో పోటీచేసిన సుజాతను కాదని బీజేపీకి చెందిన కంది శ్రీనివాస్రెడ్డి అనే ఎన్నారైకి టికెట్ ఇస్తామని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. దీనిపై ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతలు భగ్గమంటున్నారు. ఢిల్లీలో మల్లికార్జునఖర్గే, బెంగళూరులో డీకే శివకుమార్ వద్ద మొరపెట్టుకుంటున్నారు.
గద్వాల టికెట్ను డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్రెడ్డి, ఎన్ఎస్యూఐ నేత రాజీవ్రెడ్డి ఆశిస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చిన సరితాయాదవ్కు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది. దీంతో పాతవారిని కాదని కొత్త వారికి టికెట్ ఇవ్వడం ఏమిటని పార్టీ క్యాడర్ ప్రశ్నిస్తున్నది. సరితాయాదవ్ పేరును తెరమీదకు తీసుకుకొచ్చింది రేవంత్రెడ్డి వర్గమేనని మండిపడుతున్నారు. సునీల్ కనుగోలు ఇచ్చే సర్వే నివేదికలకు విశ్వసనీయత ఎక్కడ ఉన్నదని ప్రశ్నిస్తున్నారు.
సర్వేలన్నీ బూటకం
సర్వేలన్నీ బూటకమని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సత్తుపల్లి, తుంగతుర్తి, కంటోన్మెంట్ నియోజకవర్గాల నుంచి ఒక పారాచ్యూట్ నేత దరఖాస్తు చేసుకున్నాడని, ఆయన ఎన్నడూ కంటోన్మెంట్ ముఖం చూడలేదని ఉదహరిస్తున్నారు. కానీ, సునీల్ కనుగోలు సర్వేలో ఆయనకు 68% అనుకూలంగా ఉన్నట్టు రిపోర్టు ఇచ్చారని, ఇదేమిటని నిలదీస్తే 48 శాతానికి తగ్గించారని, అసలు నియోజకవర్గం ముఖమైనా చూడని నేతకు 48 శాతమైనా ఎలా వస్తుందని అడిగితే జవాబు దొరకడంలేదని మండిపడుతున్నారు.
శేరిలింగంపల్లి టికెట్ను పీసీసీ కార్యదర్శి సత్యనారాయణ ఆశిస్తుండగా బీజేపీ నుంచి వచ్చిన రఘునాథ్యాదవ్ పేరును తెర మీదకు తెచ్చారు. ఆయన కార్పొరేటర్గా పోటీచేసి ఓడిపోయారు. అయితే సర్వేలో ఆయన పేరు పైకి తేలింది. ఇదెక్కడి మాయాజాలం అని సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఇటీవల ఖమ్మం నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డితోపాటు పార్టీలో చేరగానే టికెట్ కన్ఫార్మ్ చేశారు.
ఉప్పల్లో కార్పొరేటర్గా పనిచేసిన సోమశేఖర్రెడ్డి టికెట్ ఆశిస్తుండగా టీడీపీ నుంచి వచ్చిన పరమేశ్వర్రెడ్డిని తెరమీదకు తీసుకొచ్చారు. సోమశేఖర్రెడ్డి విద్యార్థి దశ నుంచే ఎన్ఎస్యూఐ కార్యకర్తగా కాంగ్రెస్ కోసం పనిచేశారు. రేవంత్రెడ్డికి దగ్గరి వాడైన కారణంగానే పరమేశ్వర్రెడ్డికి టికెట్ ఖాయమైందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ అదే జరిగితే ఊరుకునేదిలేదని సోమశేఖర్రెడ్డి వర్గం హెచ్చరిస్తున్నది. ఇక్కడ కూడా సర్వేల పేరుతో బురిడీకొట్టించే ప్రయత్నం జరుగుతున్నదని, అదో బోగస్ సర్వే అని కాంగ్రెస్ వర్గాలే ఆరోపిస్తున్నాయి.
భూములు ఇవ్వు.. టికెట్టు పట్టు
హైదరాబాద్కు అతి సమీపంలోని ఒక నియోజకవర్గ మహిళకు టికెట్టు ఇస్తామని పీసీసీలోని కీలక నేత హామీ ఇచ్చారని, ప్రతిఫలంగా 5.32 ఎకరాల భూమిని తన అనుచరుల పేరు మీద రాయించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జనగామలో కూడా ఒక నేత దగ్గర 2.20 ఎకరాల భూమిని పీసీసీలో కీలక నేత తన వారికి తాకట్టు పెట్టించినట్టు తెలిసింది. ‘ఎన్నికల ప్రచారానికి నిధులు సర్దుబాటు చేస్తాం. భూములు అమ్మండి. నేను చెప్పిన వారికి, నేను చెప్పిన ధరకు అమ్మాలి’ అని సదరు పీసీసీ నేత చెప్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొత్తగా పార్టీలో చేరిన ఓ ఎన్నారైని రూ.15 కోట్లు సర్దుబాటు చేయాలని ఆర్డర్ వేశారని సమాచారం. ఆయన హైదరాబాద్లో జరిగిన ప్రియాంకాగాంధీ మీటింగ్కు రూ.5 కోట్లు ఇచ్చుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. దక్షిణ తెలంగాణలో టికెట్ ఆశిస్తున్న ఓ మున్సిపల్ చైర్మన్ తాను ఇప్పటికే రూ.10 కోట్లు ఒక కీలక నేతకు ఇచ్చినట్టు చెప్తున్నారు. తనకే టికెట్ పక్కా అని కూడా ప్రచారం చేసుకుంటున్నారు. నల్లగొండ జిల్లాలో కూడా ఒక కీలక నేతపై ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి.
బ్లాక్ ఫార్చూనర్ కార్ల కలకలం
పీసీసీలోని ఒక కీలక నేతకు అనుచరుడిగా పేరొందిన ఒక మైనార్టీ నేత పది నల్లరంగు ఫార్చూనర్ కార్లను సమకూర్చాల్సిందిగా ఒక అభ్యర్థికి టెండర్ పెట్టారు. ఆ కార్లను ఎలా ఆర్డర్ పెట్టాలో, ఎక్కడ డెలివరీ చేయాలో కూడా సెలవిచ్చారు. ఇది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పది కార్లను ఇవ్వాలని ఒక్కరికే టెండర్ పెట్టడం సరికాదని ఆ నేత తన దగ్గరి వారికి చెప్పుకొని వాపోతున్నారు.