డిండి/దేవరకొండ, మే 11: నల్లగొండ జిల్లా డిండి పంచాయతీ కార్యదర్శి, ఇన్చార్జి ఎంపీవో శ్రవణ్కుమార్ లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి చిక్కాడు. డిండి మండల కేంద్రానికి చెందిన బాయరాజు శంకరయ్య ఇంటి స్థలం కాగితాల కోసం గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నాడు.
ఆరు నెలలుగా తిరుగుతున్నా డాక్యుమెంట్లు ఇవ్వకుండా పంచాయతీ కార్యదర్శి శ్రవణ్కుమార్ నిర్లక్ష్యం చేస్తున్నాడు. కాగితాలు ఇవ్వడానికి రూ.15 వేలు డిమాండ్ చేశాడు. ఇటీవల శంకరయ్య రూ.5 వేలు ఇచ్చాడు. గురువారం మరో రూ.10 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పంచాయతీ కార్యదర్శి శ్రవణ్కుమార్ను అదుపులోకి తీసుకొని ఏసీబీ కార్యాలయానికి తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ బీ శ్రీకృష్ణగౌడ్ తెలిపారు.