హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పంచాయతీలు దేశానికే ఆదర్శమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని రాష్ట్ర గ్రామాభివృద్ధి సంస్థ (టీఎస్ఐఆర్డీ)లో జడ్పీ సీఈవోలు, డీపీవోలు, డీఆర్డీవోలకు రెండు రోజులపాటు ఏర్పాటుచేసిన ఓరియెంటేషన్ క్లాసులను సీఎస్ శాంతికుమారితో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పంచాయతీల్లో పటిష్ఠ ప్రణాళికలు రూపొందించుకొని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని కోరారు. పల్లెల్లో తడి, పొడి చెత్త ద్వారా వర్మి కంపోస్టు తయారుచేసి, విక్రయించి.. పంచాయతీలకు ఆదాయాన్ని సమకూర్చాలని చెప్పారు. అనంతరం సీఎస్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల్లో ఖాళీ స్థలాలను గుర్తించి వెదురు, టేకు, గంధం తదితర మొక్కల పెంపకం చేపట్టాలని కోరారు. తద్వారా పచ్చదనంతోపాటు ఆదాయం పెరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనం 7.7 శాతం పెరిగిందని, రాబోయే రెండేండ్లలో 10 శాతం పెంచే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచుల కృషితోనే 13 పంచాయతీలు కేంద్ర అవార్డులు సాధించాయని కొనియాడారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావు పాల్గొన్నారు.