కరీంనగర్, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ ధర్మపురి: ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఒకసారి సమై క్య రాష్ట్రంలో కూడా విస్తరించారు. నాటి పాలకులకు పక్కా ప్రణాళిక లేకపోవడంతో కూల్చివేసిన ఓ ఆలయం స్థానంలో ప్రస్తుతం చెప్పుల స్టాండ్ కొనసాగుతున్నది. 35 ఏండ్ల క్రితం వరకు లక్ష్మీనరసింహస్వా మి దేవస్థానం ముందు విఠలేశ్వర స్వామి ఆలయం ఉండేది. శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయంగా ఉన్న విఠలేశ్వరస్వామి ఆలయంలో నిత్యపూజలు జరిగేవి. ఆ ఆలయాన్ని అభివృద్ధి పేరుతో 35 ఏండ్ల కిత్రం కూల్చివేశారు. ఆలయంలో ఉన్న శివపార్వతుల పంచలోహ విగ్రహాలను రామలింగేశ్వరాలయంలో భద్రపరిచారు. కానీ కొద్ది రోజులకే అ విగ్రహాలు మాయమయ్యాయి. ఆ ఘటనపై ఎలాంటి విచారణ జరుగలేదు.
ఇక ఆ దేవాలయం స్థలంలో అప్పటి సమైక్య సర్కార్ భక్తుల సౌకర్యార్థం వసతి గదులు నిర్మించింది. అందులోనే కొంతకాలం దేవస్థానం కార్యాలయాన్ని నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ అభివృద్ధి పేరుతో ఆ వసతి గదులను కూల్చివేశారు. ప్రస్తుతం ఆ స్థలంలో చెప్పుల స్టాండ్, భక్తులు సామాన్లు భద్రపరుచుకునే గది, పోలీస్ విచారణ కౌంటర్ను ఏర్పాటుచేశారు. వీటికోసమా విఠలేశ్వర ఆలయాన్ని కూల్చివేసింది? అన్న విమర్శలు నేటికీ వ్యక్తమవుతున్నాయి.
గతంలో జరిగిన తప్పులు కండ్లముందు కదలాడుతుండగానే ఇప్పుడు మరోసారి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విస్తరణ పేరిట రేవంత్ ప్రభుత్వం హడావుడి చేస్తున్నది. విస్తరణలో భాగంగా ఎటువంటి నిర్మాణాలు చేపడుతారో చెప్పకుండా తీసుకుంటున్న చర్యలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘అభివృద్ధి పేరుతో మొదట ఆలయాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత వసతి గదులు పోయాయి. ఇప్పుడు మా ఇండ్లు కూల్చుతామంటున్నారు’ అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.